మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభమై అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగాయి. పరమేశ్వరుడిని దర్శించుకొని పూజల్లో పాల్గొనేందుకు క్యూలైన్లలో భక్తులు బారులుతీరి కనిపించారు. ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా శివపార్వతుల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిపించారు. భక్తుల జాగారణ దృష్ట్యా ఆలయాలను సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు, అధికారులు ఏర్పాట్లు చేశారు.