మద్నూర్, డిసెంబర్ 18: మూడు రాష్ర్టాల భక్తుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు నెరవేర్చే పుణ్యక్షేత్రం, దక్షిణ ముఖ హనుమాన్ మందిరంగా ప్రసిద్ధి చెందింది సలాబత్పూర్ అంజనేయస్వామి ఆలయం. మూడు రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దులో వెలసి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. జాతీయ రహదారికి అనుకొని మద్నూర్, దెగ్లూర్ మధ్య ఈ ఆలయం ఉన్నది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి నిర్వహించే ఉత్సవాలు వైభవంగా సాగుతాయి.
సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని పూర్వీకులు చెబుతారు. ఆలయం పక్కన ఉన్న గుట్టలో ఆంజనేయస్వామి విగ్రహం బయటపడిందని, గుట్టల మధ్య ఉన్న విగ్రహన్ని కిందకి తీసుకువచ్చి ప్రతిష్ఠించారని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. ఆంజనేయస్వామిని దర్శించుకుంటే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం ఆయా గ్రామాల నుంచి భక్తులు పాదయాత్రతో దర్శనానికి వస్తుంటారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ కొనసాగుతున్నది. ఇక్కడి స్వామి విగ్రహానికి సిందూరం పూయరు.
ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల ద్వారా గత ప్రభుత్వం రూ.6.70కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఆలయంలో కల్యాణ మండపం, ప్రాకార మండపం పనులు కొనసాగుతున్నాయి. నాలుగు గోపురాలు నిర్మించాల్సి ఉన్నది. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. జాతీయ రహదారిపై ఆలయం ఉండడంతో ఈదారి గుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఇక్కడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని, మందిరంలో బస చేస్తారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సైతం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇక్కడి ప్రాంత ప్రజలు కోరుతున్నారు.