బీర్కూర్, మే8: అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతన్న గోస అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా ధాన్యాన్ని కొనుగోలు చేసే మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని బైరాపూర్, బీర్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 8500 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయగా అందులో వెయ్యి ఎకరాల వరకు ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒక వైపు అకాల వర్షాలు, మరోవైపు రైస్ మిల్లర్లు తరుగు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుండడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు.
పరిస్థితిని గమనించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వారం రోజుల నుంచి రాత్రనకా పగలనకా అధికారులను పురమాయిస్తూ దగ్గరుండి కాంటాలు పెట్టిస్తూ రైస్ మిల్లర్లకు తగు సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, పంట నష్టంపై సమగ్రంగా సర్వేలు నిర్వహించాలని నియోజకవర్గాలుగా వస్తున్న ధాన్యం ఎంత, రైసు మిల్లుల్లో తీసుకుంటున్న ధాన్యం ఎంత, ఎప్పటికప్పుడు ప్రభుత్వం గమనిస్తూ ప్రతి ధాన్యం గింజ రైసుమిల్లులో అన్లోడ్ అయ్యేలా చర్యలు చేపడుతోంది. సీఎం కేసీఆర్ ప్రతి ధాన్యం గింజనూ కొంటామని చేసిన ప్రకటనతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అకాల వర్షాలతో తల్లడిల్లిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ఊపిరి పీల్చుకున్నారు.
పోచారం సారు సల్లగుండాలే..
నాకు రెండు ఎకరాల పొలం ఉంది. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఎంతో దుఃఖంలో ఉన్న నేను స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్ మా వడ్లు కొంటారని తెలిసి నా పాణం లేచి వచ్చింది. ఇసుంటి వానలు పడ్డా మా వడ్లను కాంటాలు పెట్టిపిచ్చినందుకు పోచారం సారూ, ప్రభుత్వం వంద సంవత్సరాలు సల్లంగ ఉండాలి.
– రుక్మిణి, రైతు, బీర్కూర్
రైతులకు అందుబాటులో ఉంటాం
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఎల్లప్పుడు రైతులకు అందుబాటులో ఉంటాను. నిబంధనలకు అనుగుణంగానే తూకాలు వేస్తున్నాం. తూకాల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా రైతులు నిర్భయంగా మాకు ఫిర్యాదు చేయాలి. త్వరలోనే తరుగు లేకుండా ధాన్యం తీసుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
– శ్రావణ్కుమార్, సీనియర్ ఏఈవో