బాన్సువాడ, డిసెంబర్ 2: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 70 నుంచి 75 స్థానాల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. బాన్సువాడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో రావడం ఖాయమని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఎందుకంటే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మవద్దో ప్రజలకు తెలుసని అన్నారు. పదేండ్లుగా బీఆర్ఎస్ పాలనను కండ్లారా చూసి ఆదరిస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీలవారు మొక్కుబడిగా ఎన్నికలప్పుడు హడావుడి చేస్తే నమ్మబోరని, ఉత్తుత్తి హామీలు ఇచ్చేవారు ఎవరు? హామీలను నిలబెట్టుకునేవారు ఎవరనేది ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. బయట హంగామా చేస్తున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీకి ఓటర్లు లేరని అన్నారు. బీఆర్ఎస్కే బలమైన ఓటు బ్యాంకు ఉందని వెల్లడించారు. ప్రజలకు కేసీఆర్పైనే విశ్వాసం ఉందన్నారు. ఆయన మాటిస్తే తప్పకుండా చేస్తాడని, మోసంచేసే అలవాటు లేదని తెలిపారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అంతటా పాలన, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు రానీయకుండా.. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ ఆపలేదని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లను సకాలంలో అందజేశారని వివరించారు. కేసీఆర్ వద్ద సమర్థవంతమైన నాయకత్వం ఉండబట్టే ప్రజలకు ఇబ్బందులు రాలేదని, బీఆర్ఎస్ పాలనకు ఇదే నిదర్శనమని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అభ్యర్థులందరూ అఖండ మెజారిటీ సాధిస్తారని అన్నారు. కొన్ని సర్వే సంస్థలు.. వారికి అనుకూలంగా ఉండే పార్టీలవైపే ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయని అన్నారు. కానీ, ఎగ్జిట్ పోల్స్కు ఎగ్జాక్ట్ పోల్స్కు చాలా తేడా ఉంటుందన్నారు. పోలింగ్ పూర్తయిన ఐదారు గంటల తర్వాతనే వాస్తవాలు తెలుస్తాయని, వెంటనే వెల్లడించే పోల్స్ను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం ఉదయం కచ్చితమైన పోల్స్ బయటపడుతాయని, నూటికి నూరుశాతం తిరిగి బీఆర్ఎస్ పార్టీ గెలుపు సాధిస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. లేదంటే పేదోడి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ ఆగిపోతాయని తెలిపారు. ప్రజలు.. ఎవరి కండ్లను వారు పొడుచుకోరని అన్నారు. తాను బాన్సువాడలోని ఓ పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు రాజవ్వ అనే వృద్ధురాలిని పలుకరిస్తే.. ‘కడుపునిండా అన్నంతినేలా చేసిన మిమ్మల్ని ఎట్లా మర్చిపోతం.. కారు గుర్తుకే ఓటేసినం. వేరే పార్టీవాళ్లు పైసలిచ్చినా తీసుకోలేదు..’ అని తనతో చెప్పిందని స్పీకర్ వివరించారు. ఇలా లక్షలాది మంది ఆశీర్వాదం కేసీఆర్పై ఉందని, డబ్బులు పంచినంత మాత్రానా ఓట్లు పడతాయని, గెలుస్తామని చెప్పుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఉందన్నారు. బీజేపీకి మద్దతుగా కేంద్ర మంత్రులు, పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేసినా, కాంగ్రెస్ వారు బోలెడన్ని ఉత్తుత్తి హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఉన్నది ఉన్నట్లుగా నిజాలను రాసిన మీడియా సంస్థలు, పాత్రికేయులకు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ గెలుపుకోసం తనకన్నా ఎక్కువగా శ్రమించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతోపాటు నిండు మనస్సుతో ఆశీర్వదించిన ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు.