బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలనలో అన్యాయానికి గురైన తెలంగాణ.. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్వన్గా నిలిచిందన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే అక్కడ కేసీఆర్ ఉండాల.. ఇక్కడ (బాన్సువాడ) పోచారం ఉండాలని అన్నారు. శనివారం బాన్సువాడ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన 7.82 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
కోటగిరి/దుర్రూర్/బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 30: ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు 60 ఏండ్లలో తెలంగాణకు ఏలాంటి నిధులు మంజూరు చేయలేదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలిపారని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతంగల్ మండలం సుంకిని గ్రామంలో శనివారం సుమారు రూ. 3.50కోట్ల పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, రాయకూర్ క్యాంపు గ్రామాల్లో దాదాపు రూ. 3.30కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో రూ. కోటితో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో భారీగా నిధులు తెచ్చి బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. కొత్త ఎమ్మెల్యే వస్తే అభివృద్ధి కాగితాలకే పరిమితమవుతుందని అన్నారు.
కేసీఆర్కు తనపై ఉన్న ప్రేమ, నమ్మకంతో అడిగినన్ని నిధులు ఇస్తున్నారని తెలిపారు. ప్రజల దీవెనలతో రెండుసార్లు గెలిచిన తాను.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. అక్కడ సీఎం కేసీఆర్.. ఇక్కడ పోచారం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, మన ఊరు-మనబడికి భారీగా నిధులు కేటాయించారని గుర్తుచేశారు. విద్యార్థులకు చదువే బ్రహ్మాస్త్రం అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ గృహలక్ష్మి పథకం మంజూరు చేస్తామన్నారు. మహారాష్ట్రలో ఏలాంటి సంక్షేమ పథకాలు లేవని, ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి తెలంగాణకు వస్తామని దరఖాస్తు చేసుకుంటున్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకే దిక్కులేదు..
కర్ణాటక ఎన్నికల్లో హామీలిచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. నేడు ఒక్కటి కూడా అమలు చేయడంలేదని సభాపతి అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి నేడు బెంగళూరు నగరానికే కరెంట్ ఇవ్వడంలేదన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న కాంగ్రెస్.. డీజిల్ లేక బస్సులు కూడా నడపడంలేదన్నారు. ప్రజలకు బియ్యం లేక అక్కడి సీఎం.. మన కేసీఆర్కు ఫోన్ చేసి బియ్యం కావాలని అడుతున్నారని గుర్తుచేశారు. అక్కడి హామీలకే దిక్కులేదుగానీ, మళ్లీ తెలంగాణలో 6 గ్యారంటీల పేరిట మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని, ఇండ్లు కట్టకుండానే కోట్ల రూపాయల బిల్లులను మింగేశారని విమర్శించారు. మోసపూరిత హామీలిచ్చే పార్టీలను నమ్మొద్దని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించాలని స్పీకర్ కోరారు. సిద్ధాపూర్ రిజర్వాయర్తో గట్టుమీది గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని స్పీకర్ అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీలు సునీతా శ్రీనివాస్, సుజాతా నాగేందర్, నీరజావెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీలు శంకర్పటేల్, గంగారాం, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
కేటీఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన..
బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 30: బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందకు మంత్రి కేటీఆర్ ఈ నెల 4న పర్యటించనున్న నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి సభకు హాజరేయ్యే వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. పనులు మిగిలిపోతే వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. వారి వెంట బల్దియా చైర్మన్ గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్డీవో భుజంగరావు తదితరులు ఉన్నారు.