కామారెడ్డి, సెప్టెంబర్ 5 : జన్మనిచ్చేది తల్లి, నడక నేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చేది గురువులని, గురువులేని విద్య గుడ్డిదని, స్థానం ఏదైనా అందరికీ ఉపాధ్యాయులే మార్గదర్శకులని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ జ్యోతిప్రజ్వలన చేసి సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులను తయారు చేసేది ఉపాధ్యాయులని,అందుకే గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఉంటుందన్నారు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది ఉపాధ్యాయులేనని, తాము కూడా ఒకనాడు విద్యార్థులమేనని అన్నారు.
గురువుల విద్యాబోధనతోనే తమకు జ్ఞానం,విలువలు అబ్బినట్లు చెప్పారు. చంద్రయాన్-3 విజయవంతానికి కృషిచేసిన సైంటిస్టులకు చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పింది కూడా ఉపాధ్యాయులేనని, మెరుగైన సమాజం ఉండాలంటే నాణ్యమైన విద్య ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల్లో సుమారు 36లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారని, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది గురువులేనని అన్నారు. తరగతి గదిలో విద్యార్థులందరినీ ఉపాధ్యాయుడు ఒకేలా భావిస్తాడని, దానిని స్వీకరించే విధానాన్ని బట్టి విద్యార్థి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి హోదాలో నిజామాబాద్కు వచ్చినప్పుడు తామంతా స్కూల్ డుమ్మాకొట్టి వారి సభకు వెళ్లి అద్భుతమైన ప్రసంగం విన్నామన్నారు. ధనం ఉన్న వారికన్నా విద్యావేత్తలకు గౌరవం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చేందుకు ఉపాధ్యాయులు పగలు,రాత్రి కూడా కష్టపడుతున్నారని తెలిపారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ జీవితంలో మార్పునకు నాంది గురువులని, జ్ఞానమిచ్చిన గురువులను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
ప్రతి స్టేజీలో మన ఎదుగుదలకు ఒక గురువు తారసపడతారని, వారిని మననం చేసుకోవాలని అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ విద్యావ్యవస్థలో మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా విద్యార్థులు తమ జీవితాలను మలచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాలలు నెలకొల్పి గుణాత్మకమైన విద్యనందిస్తున్నదని అన్నారు. డ్రాప్ అవుట్స్ తగ్గాయని తెలిపారు. మనలో ఉన్న సృజనాత్మకతను గురువులు గుర్తించి ప్రోత్సహిస్తారని, వారిని మరిచిపోవద్దని చెప్పారు. అనంతరం 47మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా కప్పి ప్రశంసాపత్రంతో సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పరీక్షల సహాయ కమిషనర్ నీలం లింగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.