వర్ని, జూన్ 7: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలోని 50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించిన సాగునీటి దినోత్సవానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కేవలం రూ.54వేల కోట్లు వెచ్చించారని, తెలంగాణ సాధించుకున్న తర్వాత రూ.లక్షా70వేల కోట్లను వెచ్చించి సాగునీరందిస్తున్నట్లు వివరించారు.
30ఏండ్లయినా కాంగ్రెస్ హయాంలో పూర్తికాని ప్రాజెక్టులను కేవలం మూడేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులు నీళ్లు లేని చోట కాలువలు తవ్వి కాంట్రాక్టర్ల జేబులు నింపారని, వాళ్లు ప్రాజెక్టులు కట్టే ప్రదేశంలో నీళ్లు లేవన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు తెలంగాణలోని కేసీఆర్లాంటి పరిపాలన కావాలని కోరుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందన్నారు. అన్ని రాష్ర్టాల్లో కేసీఆర్ నాయకత్వం వహించే రోజు త్వరలోనే వస్తుందన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ ఢిల్లీ వెళ్తేసీఎంగా కేటీఆర్ అంటామని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పలేక వాళ్లలోవాళ్లే తన్నుకుంటారన్నారు.
సిద్దాపూర్ రిజర్వాయర్తో 14వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని తెలిపారు. జాకోర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిజాంసాగర్ ఆయకట్టేతర రైతులకు సాగునీరందిస్తున్నామన్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి చేసి చూపించారన్నారు. దేశంలోనే అత్యధిక డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసిన ఘనత స్పీకర్కు దక్కిందన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించి సాగునీరందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, జడ్పీటీసీలు బర్దావల్ హరిదాస్, గుత్ప విజయ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ మూడ్ కవితాఅంబర్ సింగ్, ఎంపీపీలు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.