తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండానుఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రగతి నివేదికలను ప్రజల ముందుంచారు.వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
రాష్ట్రం అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధిస్తూ యావత్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాడు అనేక రంగాల్లో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నదని.. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు సీఎం కేసీఆర్ ముందుండి నడిపిస్తున్నారు. నేడు రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే ఉన్నత స్థానానికి చేరింది.
-మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. కామారెడ్డి సమీకృత భవనంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ న్యూ కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా సమగ్ర అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కామారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్షిండే, ఎంపీ బీబీపాటిల్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, నిజామాబాద్లో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.