బాన్సువాడ టౌన్, జూన్ 2: ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణం నుంచి కొయ్యగుట్ట తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు శుక్రవారం రాత్రి నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సభాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. సుమారు 70 ఏండ్లు విడుతల వారీగా జరిగిన ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఎందరో వీరులు ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలకు ఎదురునిలిచారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున లేవగా.. 2014 జూన్ 2వ తారీఖున అప్పటి కేంద్రం ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించిందని తెలిపారు. ఈ విజయం అమరవీరులకు చెందుతుందన్నారు. రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడకముందు కేసీఆర్ ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల నగదుతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ సాధనతో మన పోరాటం ఆగలేదని.. బంగారు తెలంగాణను ఎప్పుడు నిర్మించుకుంటామో అప్పుడే సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్లు అని వివరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ దోడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, సీనియర్ నాయకులు ఎజాస్, పిట్ల శ్రీధర్, వెంకట్రాంరెడ్డి, జీపీ కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.