కామారెడ్డి,మార్చి 27 : పార్లమెంట్ ఎన్నికలను పోలీసు అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ సింధూశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో బుధవారం నెలవారీ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం సూచనల ప్రకారం బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానిత వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో భరోసా కల్పించేలా పని చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగులు, జూదం, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దొంగతనం కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకొని సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరగా అందేలా చూడాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విధుల్లో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు నాగేశ్వర్రావు, సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ జార్జ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు తదితరులు పాల్గొన్నారు.