ఖలీల్వాడి/విద్యానగర్, నవంబర్ 17 : ఉమ్మడి జిల్లాలో చలి ప్రభావం పెరిగింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటున్నది. దీంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి హరీశ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ముందుగానే చలి ప్రభావం పెరిగింది. సాయంత్రం 5 గంటలు దాటితే చలితీవ్రత మొదలవుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తున్నది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెట్టర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. పల్లె ప్రజలు చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత ఈ సీజన్లో అత్యల్పంగా 15.4 డిగ్రీల సెల్సీయస్గా నమోదుకాగా, బుధవారం 15.4, గురువారం 15.7 డిగ్రీలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో ఈ నెల మొదటి వారంలో 32 డిగ్రీలు ఉన్న గరిష్ఠ ఉష్ణోగ్రత.. గురువారం నాటికి 29కు పడిపోయింది. కనిష్ఠంగా 15 డిగ్రీల సెల్సీయస్గా నమోదైంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో వెచ్చటి ఉన్ని దుస్తులను వాడాలని సూచించారు.