వినాయక్నగర్, ఏప్రిల్ 8: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నిజామాబాద్ పోలీసులు. ఫేక్ బ్యాంక్ ఖాతాలు తెరిచి, సైబర్ నేరాలకు సహకరిస్తున్న జిల్లాకు చెందిన 13 మందిని పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి పంపించారు. కేసు వివరాలను సీపీ సాయిచైతన్య బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కర్ణాటక బ్యాంకులో తప్పుడు ధ్రువపత్రాలతో అక్రమంగా కరెంట్ బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ మోసగాళ్లకు విక్రయిస్తున్న నెట్వర్క్లను పోలీసులు ఛేదించారు.
కొంతకాలంగా జిల్లాకు చెందిన పలువురు నెలసరి అద్దె రూపంలో తీసుకుంటూ తమ బ్యాంకు అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు అప్పగించారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వాళ్లు నేరాన్ని అంగీకరించినట్లు సీపీ తెలిపారు. పట్టుబడిన నిందితుల బ్యాంకు అకౌంట్ల ద్వారా మూడు నెలల వ్యవధిలో రూ.151 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సీపీ వెల్లడించారు. నిందితులు మహ్మద్ జమీల్ అహ్మద్ (ఆర్సపల్లి), షేక్ షోయబ్ (ఎడపల్లి), మహ్మద్ సమీర్ (నిజామాబాద్), భానుప్రసాద్ (బోధన్), మహ్మద్ ఆర్బాజ్ (బోధన్), బోగుడమీద వీరేశం (బోధన్), రహీం అలీ (నిజామాబాద్), అబ్దుల్ వాసిం (బోధన్), షేక్ ఇఫ్తేకార్ (రెంజల్), సబావత్ అశోక్ (రెంజల్)లకుసైబర్ నేరగాళ్లతో సంబంధాలున్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు.
నిందితులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు సీపీ వెల్లడించారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన 4వ టౌన్ ఎస్హెచ్వో సతీశ్తో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు. ప్రజలు తమ బ్యాంకు అకౌంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకూడదని సూచించారు. ఇతరుల నుంచి వచ్చే కాల్స్, లింక్స్ మెసేజ్లను నమ్మకూడదని సూచించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని తెలిపారు.