Peddakodapgal | పెద్ద కొడప్ గల్, జూన్ 25 : పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం లోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతులకు నాణ్యమైన పెసర, మినుము, కంది విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కిషన్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి సాగు చేయాలని సూచించారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే ఖరీఫ్ సీజన్లో సాగుకు అనువైన పంటలు, విత్తన రకాలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.
విత్తన మేళాలో వివిధ రకాల పంటల విత్తనాలను ప్రదర్శించి రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు తమ సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు శామప్ప పటేల్, నాగిరెడ్డి, బస్వరాజ్ దేశాయ్, వివిధ గ్రామాల సర్పంచులు,వ్యవసాయ విస్తరణ అధికారులు ఉత్తమ్,స్వాతి, రైతులు పాల్గొన్నారు.