CP Sai Chaitanya | వినాయక నగర్, జూన్ 7 : బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదు ల వద్ద ప్రత్యేక పికెట్లతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నిజామాబాదు లోని శాంతి నగర్ ఈద్గా, బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు ఈద్గాలను పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీతో పాటు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ పీ శ్రీనివాస్, CCRB ఏసీపీ రవీందర్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.