దశాబ్దాలుగా దగా పడిన దళితులు.. తెలంగాణలో దర్జాగా బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. సామాజిక వివక్షకు గురైన దళిత కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి సమాజంలో గౌరవంగా బతకాలనే లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటికే తొలి విడుతలో ఉమ్మడి జిల్లాలోని 2,198 మందికి కేసీఆర్ సర్కారు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. ఆ డబ్బుతో లబ్ధిదారులు పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారులుగా మారి పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రెండో విడుత దళితబంధుకు శ్రీకారం చుట్టింది. ఒక్కో నియోజకవర్గంలో 1100 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నది. తద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 9900 దళిత కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనున్నది. త్వరలోనే రెండో విడుత యూనిట్లు మంజూరు కానుండడంతో దళిత కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– నిజామాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేద దళిత కుటుంబాల్లో ఆర్థిక వెలుగులను ప్రసరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఆయా కుటుంబాల్లో ఆర్థిక పరిపుష్టి సాధించి వివిధ రంగాల్లో ముందడుగు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.వెనుకబడిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వ్యాపారవేత్తలుగా ఎదిగి, స్వయం సమృద్ధి సాధించేందుకు బాటలు వేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ మొత్తంలో ఓ పథకాన్ని నేరుగా నగదు బదిలీ చేయడం లేదు. పూర్తిస్థాయి రాయితీతో ఎలాంటి కండీషన్లు, లబ్ధిదారుడి వాటా లేకుండా అమలవుతున్న పథకంగా దళితబంధు చరిత్రకెక్కింది. ఆరు నూరైనా దళితబంధు పథకాన్ని అమలు చేసి చూపిస్తామని 2020 ముగింపులో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని హుజురాబాద్లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టి రాష్ట్రం నలుమూలలకు తీసుకెళ్లారు. నియోజకవర్గానికి వంద చొప్పున యూనిట్లు పంపిణీ పూర్తి కావడంతో 2023-24 ఆర్థిక సంవత్సంలో మరింత మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండో విడుతకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈసారి 9900 యూనిట్లు…
ఉమ్మడి జిల్లాలో తొలి విడుతలో దళితబంధు పథకం 2198 మందికి లబ్ధిని చేకూర్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 100 యూనిట్లు చొప్పున నిజామాబాద్లో 550, కామారెడ్డిలో 350 యూనిట్లు మంజూరయ్యాయి. పైలట్ ప్రాజెక్టు కింద నిజాంసాగర్ మండలంలో దళితులందరికీ 1298 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేశారు. తాజాగా రెండో విడుతలో భాగంగా వేలాది మందికి ఉమ్మడి జిల్లాలో దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది. త్వరలోనే యూనిట్ల మంజూరు చేపట్టబోతున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. అత్యంత పారదర్శకంగా దళితబంధును అమలు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ సారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 9900 మందికి దళితబంధు ద్వారా ప్రయోజనం అందనుండడంతో దళిత సమాజమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం దళిత జాతిలో పేద కుటుంబాలందరికీ ఆశాదీపం మాదిరిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారంటూ ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. కలెక్టర్ల స్వీయ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా పథకం అమలు కానున్నది.
నేరుగా రూ.10లక్షల సాయం…
దళితబంధు పథకంలో ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారుడికి ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రూ.10లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే అందిస్తుండడం దేశంలో మరెక్కడా లేదు. ఇలాంటి గొప్ప పథకం ద్వారా అణగారిన వర్గాల్లో అత్యున్నతమైన జీవన ప్రమాణాలను పెంపొందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం ఎంతో మందితో చర్చోపచర్చలు చేసిన తర్వాత మూడేండ్ల క్రితం నుంచి అమల్లోకి వచ్చిన పథకాన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి చూపించారు. తాజాగా రెండో విడుతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏకంగా 1100 యూనిట్లు మంజూరు కాబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. రెండో విడుతలో వేలాది మంది దళిత కుటుంబాల్లో గణనీయమైన మార్పు సంభవించనున్నది. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలపై అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
నిజాంసాగర్లో 1298 మందికి అందజేత…
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన జుక్కల్ నియోజకవర్గంలోని ఈ మండలంలో దళిత కుటుంబాలందరికీ లబ్ధి చేకూరింది. 1298 మందికి దళితబంధు కింద ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రయోజనం పొందిన వారంతా తమ కాళ్లపై తాము నిలబడి దర్జాగా బతుకుతున్నారు.
దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన రూ.10లక్షలు వారి బ్యాంక్ అకౌంట్లలోనే జమ అవుతాయి. కానీ వీటిని వ్యక్తిగత అవసరాలకు వెచ్చించకుండా సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసి గతంలో మంజూరైన లబ్ధిదారులకు అమలు చేసింది. లబ్ధిదారుడు నేరుగా బ్యాంకు నుంచి డ్రా చేసుకునేందుకు వీలులేకుండా నిబంధనలు పెట్టారు. దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారుడు తన ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకునే యూనిట్కు సంబంధించిన పేమెంట్ సైతం నేరుగా చెల్లింపులు జరుగుతాయి. దళితబంధు నగదు లబ్ధిదారునికి లాభం చేసేదే తప్ప ఎక్కడా నగదు రూపంలో ప్రత్యక్షంగా చేతులు మారే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేశారు. ఒక యూనిట్లో రూ.10లక్షలకు అంత కన్నా తక్కువ వ్యయం అయితే మిగిలిన డబ్బులను సైతం సొంతానికి వెచ్చించేందుకు వీలు లేదు. వాటిని యూనిట్ను దీర్ఘకాలికంగా ఎలాంటి నష్టాలు సంభవించకుండా లాభదాయకంగా నడిపించేందుకు వినియోగించాల్సి ఉంటుంది.
దళితులందరికీ ఆర్థిక సాయం
నిజాంసాగర్ మండలాన్ని పైలట్ మండలంగా ప్రకటించి మండలంలో ఉన్న దళితులందరికీ దళితబంధు పథకాన్ని అందజేశారు. నాకు కూడా పది లక్షల రూపాయలు ఇవ్వడంతో మేకలను కొనుగోలు చేశా. ఎనిమిది నెలల కింద నాకు మేకలు ఇవ్వడంతో ఇప్పటి వరకు సుమారు రూ.లక్షా 50వేలు సంపాదించుకున్నాను. మేకల సంఖ్య పెరగడం వాటి ద్వారా ఆదాయం రావడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ దళితుల గురించి ఇంతగా ఆలోచించడం సంతోషంగా ఉంది.
-మంత్రి, రవి, నిజాంసాగర్ గ్రామం
తలెత్తుకొని బతుకుతున్నాం
సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని నిజాంసాగర్ మండలంలో ప్రవేశపెట్టడంతో సంఘంలో తలెత్తుకొని బతుకుతున్నాం. నాకు రూ.పది లక్షలు అందజేయడంతో ట్రాలీ ఆటోను కొనుగోలు చేసుకున్నాను. సంవత్సరం కిందట ఆటో తీసుకున్నా. నెలకు అన్ని ఖర్చు లు పోను రూ.20వేల వరకు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. రెండో విడుత దళిత బంధు పథకాన్ని మంజూరు చేయడంతో ఇతర గ్రామాల్లో ఉన్న మా బంధువులు కూడా సంతోషంగా ఉన్నారు. వారికి కూడా ఈ పథకం అందనుండడంతో చాలా సంతోషంగా ఉంది.
-కంభాపురం వెంకటి, బంజపల్లి గ్రామం.
నా చిన్న కుమారుడికి దళితబంధు రానున్నది
నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి దళితబంధు రావడంతో వరి కోత యంత్రాన్ని కొనుగోలు చేశాడు. చిన్న కుమారుడికి రెండో విడుతలో అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ సారు రెండో విడుత దళిత బంధు పథకాన్ని మంజూరు చేయడంతో చాలా సంతోషంగా ఉంది. నా చిన్న కుమారుడికి కూడా పథకం రానుండడంతో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ప్రతి దళితుడు లక్షాధికారి కావాలన్న లక్ష్యం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది.
-మంగ ప్రకాశ్, గోర్గల్, గ్రామం
దళితబంధు రానుండడంతో సంతోషంగా ఉంది
దళితబంధు పథకంలో మొదటి విడతలో మండలంలో 1298 మందికి అందించారు. నేను కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే రెండో విడుతలో అందజేస్తామని చెప్పారు. రెండో విడుతలో నాకు కూడా దళితబంధు పథకాన్ని అందజేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. నేను సూపర్మార్కెట్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాను. సీఎం కేసీఆర్ ప్రతి దళితుడు లక్షాధికారి కావాలన్న లక్ష్యంతో అందజేస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
-చిన్నసాయిలు, మల్లూర్ గ్రామం