కామారెడ్డి పట్టణంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. మరో రెండు రోజుల పాటు కొనసాగునున్న సైన్స్ఫెయిర్లో భాగంగా మొదటి రోజు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన మొత్తం 510 ప్రాజెక్టులను ప్రదర్శించారు.
విద్యానగర్, నవంబర్ 24: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 50వ రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీలో పురోగతి, పర్యావరణ హితమైన పదార్థాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా- ఆవిష్కరణలు, పర్యావరణం, ప్రస్తుత ఆవిష్కరణలతో చారిత్రక అభివృద్ధి, మన కోసం గణితం అనే ఏడు అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ఫెయిర్ విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఉన్న వనరులను కాపాడుకొని, వనరులను పెంపొందించుకోవడంలో జరగాల్సిన కృషిని విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల ఆవిష్కరణలు భవిష్యత్తుకు దోహదపడుతుతాయని అన్నారు. సైన్స్ ఆలోచనా ధోరణిని పెంచుతుందని వివరించారు.
జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్ విభాగంలో 184 ప్రాజెక్ట్లు, 9,10వ తరగతి సీనియర్ విభాగం నుంచి 258, ఇన్స్పైర్ విభాగంలో 58, టీచర్ల విభాగంలో 10.. మొత్తం 510 సైన్స్ ప్రాజెక్ట్లను ప్రదర్శించారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఈవో రాజు, నీలం లింగం, డీఎస్వో సిద్ధిరాంరెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.