ఒకప్పుడు బీడీలు చుట్టిన మహిళ నేడు కుటీర పరిశ్రమను స్థాపించి సొంతంగా వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నది. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు బర్దీపూర్ సవిత. స్వయం ఉపాధి పొందుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. పురుషులకు దీటుగా విభిన్నకరమైన కుటీర పరిశ్రమను నెలకొల్పి స్వయంగా తయారీ, మార్కెటింగ్ చేస్తున్నారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
సవిత తన పరిశ్రమలో నలుగురు పనివారిని నియమించింది. మిల్ ఆపరేటర్లకు రూ.15వేలు, మరో ఇద్దరికి రూ.12వేల వేతనం ఇస్తున్నది. కారం సీజన్ సమయంలో ప్రతిరోజు సుమారు 30 నుంచి 40 మంది మహిళలకు రూ.400-500 చొప్పున కూలీ ఇస్తూ వారికి జీవనోపాధి కల్పించింది. ఇది మార్చి నుంచి మే వరకు కొనసాగుతుంది. వీటితోపాటు మసాలా దినుసులు, గోధుమలు, జొన్నలు, పప్పులు నాణ్యమైన వాటిని విక్రయించడంతో గిరాకీ పెరిగింది. వచ్చే సంవత్సరం నుంచి సొంతంగా బ్రాండ్ను నెలకొల్పాలనే ఆకాంక్షతో ఉన్నారు.
ప్రతి మహిళా తన కాళ్లపై తాను నిలబడాలి. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మహిళా సంఘాల సభ్యులు రుణాలను వినియోగించుకోవాలి. ఒకప్పుడు అందరిలా బీడీలు చుట్టేదానిని, ఇప్పుడు ఒక పరిశ్రమకు యజమానిని. మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉన్నది.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవన్పల్లి గ్రామానికి చెందిన సవిత-రాజులకు 2002 డిసెంబర్లో వివాహం జరిగింది. అప్పటి నుంచి సవిత బీడీలు చుడుతూ ఇంటిపని చేసుకుంటూ భర్త రాజుకు చేదోడువాదోడుగా ఉండేది. వీరికి ఇద్దరు సంతానం కుమారుడు డిప్లొమా చదువుతుండగా, కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఐదేండ్ల క్రితం సవిత మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరింది. అప్పుడు బ్యాంకు నుంచి తీసుకున్న కొద్దిపాటి రుణాన్ని తన ఇంటి అవసరాల కోసం వాడుకునేది. కానీ సవితకు ఏదైనా చేయాలన్న తపన ఉండేది. తన కాళ్లపై తాను నిలబడాలనే ఆలోచనతో ఉన్న సవితకు భర్త రాజు సహకారం తోడైంది. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఇంటికి అవసరమయ్యే పసుపు, కారం కోసం నిజామాబాద్,అంకాపూర్తోపాటు మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్లి కొనుగోలు చేసేవారు. ఇది గమనించిన సవిత ఇక్కడే ఈ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నారు. పెట్టుబడికి ఆర్థిక స్థోమత అడ్డురాగా.. తాను సభ్యురాలిగా ఉన్న గాయత్రీ మహిళా సంఘం నుంచి రూ.4.50లక్షల రుణాన్ని తీసుకున్నారు. మండల కేంద్రంలో రాజు ఇండస్ట్రీస్ పేరుతో కుటీర పరిశ్రమను నెలకొల్పారు. పరిశ్రమలో మొదట పసుపు, కారం అమ్మడం ప్రారంభించారు. వీరే మిరపకాయలు తీసుకొచ్చి వాటిని పట్టి ఇచ్చేవారు. దీంతో అనతి కాలంలోనే వీరు స్థాపించిన పరిశ్రమ అభివృద్ధి సాధించి కారం, పసుపు కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పసుపు,కారంతోపాటు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఆయిల్మిల్, పిండి గిర్నీని ఏర్పాటు చేశారు.