Pitlam | పిట్లం, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పిట్లం మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద శ్రీ రేణుకా మాత గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు సాయ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం అధికారం కోసం కాకుండా సామాన్య ప్రజలకు గౌరవం, రక్షణ, న్యాయం కల్పించాలనే సంకల్పంతో పోరాడిన మహనీయుడని అన్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి, స్వశక్తితో ఎదిగి ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపిన యోధుడిగా పాపన్న గౌడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన ధైర్యసాహసాలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం సర్పంచ్ శేఖర్, పలు పార్టీ నాయకులు రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి, అశోక్ రాజు, గౌడ సంఘం సభ్యులు రామాగౌడ్, శంకర్ గౌడ్, కాషా గౌడ్, మొగలాగౌడ్, కిరణ్ గౌడ్, రామకృష్ణ గౌడ్, రాఘవేందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, రామా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.