సంబురాల సంక్రాంతి తెలుగు లోగిళ్లకు సరికొత్త కళను తీసుకొచ్చింది. ఇంటింటా పండుగ వాతావరణం నెలకొన్నది. రంగవల్లులతో వాకిళ్లు మెరిసిపోతున్నాయి. నీలిమబ్బుల్లో రంగురంగుల పతంగుల సయ్యాటలు ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఇంటా పిండివంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. డూడూ బసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో ఊరూవాడ సందడిగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. శనివారం భోగి సందర్భంగా తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ ఆనందంగా ఆడి పాడారు. పిల్లలు, పెద్దలు పతంగులు ఎగురవేయడంలో నిమగ్నం కాగా, మగువలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం సంక్రాంతి వేడుకను వైభవంగా నిర్వహించుకోన్నారు.
ఎన్నో అనుభూతులు.. మరెన్నో మధుర జ్ఞాపకాలు.. సరికొత్త సందడికి ప్రణాళికలు.. సంక్రాంతి పండుగకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ముంగిళ్లు రంగవల్లులతో ముస్తాబుకానున్నాయి. హరిలోరంగ.. రంగ హరిలో రంగ అనుకుంటూ వచ్చే హరిదాసులు, డూడూ బసవన్నల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. గొబ్బెమ్మల సాక్షిగా పల్లెటూళ్లు బంతిపూల వనాలై స్వాగతం పలుకుతున్నాయి. శనివారం రోజు భోగి పండుగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
-ఖలీల్వాడి/ ధర్పల్లి/బాన్సువాడ రూరల్/ విద్యానగర్, జనవరి 14
జిల్లాలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. సూర్యుడు పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. పుష్యమాసంలో, హేమంత ఋతువులో శీతలగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి తర్వాత రోజు కనుమ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండుగకి ఇందూరు లోగిళ్లు సరికొత్తగా ముస్తాబవుతున్నాయి. నేడు మకర సంక్రాంతి, రేపు కనుమ నిర్వహించనున్నారు. జీవితంలో భోగభాగ్యాలను కోరుకుంటూ మహిళలు నోములు నోచుకునేందుకు సిద్ధమవుతున్నారు.
నక్షత్రాలు ఇరవై ఏడు. ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాలుండగా మొత్తం 108 పాదాలుగా విభజించబడ్డాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభజించారు. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ కాలాన్ని ఆ రాశి పేరుతో వ్యవహరిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. హిందువులంతా పెద్దల నుంచి పిల్లల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆదరించే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఉదయం ఇంటి ఎదుట రంగులరంగుల ముగ్గులు వేస్తూ, పిండి వంటలతో ఇంటిళ్లిపాది ఆనందంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి.
జిల్లాలో మార్కెట్కు సంక్రాంతి పండుగ శోభ వచ్చింది. ఎక్కడ చూసినా సంక్రాంతి కొనుగోళ్లతో సందడి నెలకొన్నది. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో విద్యార్థులు పతంగులు ఎగురవేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పిండి వంటల తయారీకి సామగ్రి, వంటనూనెల కొనుగోళ్లతో కిరాణా, సూపర్ మార్కెట్లు కిటకిటాలాడుతున్నాయి. గంగిరెద్దులు, హరిదాసు సందడి నెలకొన్నది.
మకర సంక్రాంతి తర్వాతి రోజు కనుమ పండుగ వస్తుంది. దీనిని పశువుల పండుగ అని పిలుస్తారు. పల్లెల్లో పేదలకు పశువులే గొప్ప సంపద. అవి ఆరోగ్యంగా ఉంటే పాడి రైతుకు ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంటుంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ పండుగను భావిస్తారు. అందుకే కనుమ రోజు పల్లెల్లో రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు,కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుళ్లకు నైవేద్యం సమర్పించి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీనిని పాలా చల్లడం అంటారు. ఈ సందర్భంగా సంవత్సరంపాటు పండే పంటలు చీడపీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. కనుమ రోజు గొబ్బెమ్మల పై గంగిరెద్దుల హడావిడి, హరిదాసుల రాకడ ఎడ్ల పందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.