ఖలీల్వాడి,జూన్ 26: జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫక్తు వ్యాపార సంస్థలుగా మారాయి. చదువుల పేరిట సామాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఒకవైపు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, మరోవైపు దస్తులు (యూనిఫాం), పుస్తకాలు, బ్యాగులను తమ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన క్యాంటిన్లోనే కొనాలని ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీలేక అక్కడే కొనాల్సి వస్తున్నది. ఇలా దుస్తుల విక్రయాలతో పాఠశాలలు బట్టల షాపులను తలపిస్తున్నాయి. ఇది బడా..లేదా బట్టల షాపా అనేలా దుకాణాలు నిర్వహిస్తున్నాయి. యూనిఫాం, పుస్తకాలను బయట మార్కెట్ కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.
ఈ నెల 15వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కాగా, తమ పాఠశాలల్లోని షాపుల్లోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. చిత్రమేమిటంటే నర్సరీ నుంచి పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయాలని, రూ.5వేలు కట్టాలంటూ చెప్పడం గమనార్హం. పలకా బలపం పట్టుకునే వయస్సులో పెన్నుతో పేపర్పై రాయాలా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే బెసిక్ నాలెడ్జి ఎలా వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పుస్తకాల కోసం 2, 3, 4, 5వ తరగ తుల వరకు రూ. 7వేలు వసూలు చేస్తుంటే, 8 నుంచి ఆపై తరగతులకు రూ.10వేల పైనే వసూలు చేస్తున్నారు. పుస్తకాలకే ఇంత ఖర్చు చేస్తే, ఇక ఫీజులు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఫీజులు విషయానికి వస్తే రూ. 26వేల నుంచి మొదలుకొని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. తోక పేర్లతో స్కూళ్లను నడిపిస్తుండగా, మరికొందరు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. వీటిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు తనిఖీలు చేపట్టకుండా ప్రెస్నోట్ విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారు. అనుమతులు లేని పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకోవద్దని చెబుతూ మౌనంగా ఉంటున్నారు. కొత్తగా ప్రారంభిస్తున్న పాఠశాలలను ఎందుకు తనిఖీ చేయడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి ఇంటర్నేషనల్ పాఠశాలల పేరిట తరగతులు నిర్వహిస్తున్నా విద్యాశాఖ మాత్రం మొద్దు నిద్రలో ఉండడం గమనార్హం.
గతంలో బుక్స్టాల్స్లో విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కట్టేవారు. కానీ ప్రైవేట్ పాఠశాలల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసి యూని ఫాం, పుస్తకాలు విక్రయిస్తుండడంతో బయట బుక్స్టాళ్లు, బట్టల దుకాణాలు వెలవెలబోతున్నాయి. కొన్ని బుక్స్టాల్స్ మూతపడిన
సందర్భాలూ ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యంతో బుక్స్టాల్స్ యజమానులకు ఉపాధి కరువైంది. దీనిపై డీఈవోను వివరణ కోరేందుకు యత్నించగా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
పైవేట్ పాఠశాలలకు కఠిన నిబంధనలు తీసుకురావా లి. జిల్లాలో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులు,పుస్తకాలు, యూనిఫామ్స్, షూలు, సాక్స్లు అమ్ముతుంటే విద్యాశాఖ ఏం చేస్తున్నది? వెంటనే ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, ప్రైవేట్ పాఠశాలల్లో అమ్మకాలను నిషేధించాలి.
-అభిలాష్రెడ్డి, బీఆర్ఎస్ విద్యా విభాగం జిల్లా అధ్యక్షుడు