కామారెడ్డి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ వ్యవసాయం, పోలీసు శాఖలపై ప్రత్యేక దృష్టి సారించి పట్టిషం చేశారని తెలిపారు. రూ. వేల కోట్లతో ఆధునిక పోలీసు భవనాలు, వాహనాలు, కొత్త టెక్నాలజీ పరికరాలు సమకూర్చడంతో రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని, శాంతిభద్రతలు నెలకొన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డిలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక కళాభారతి ఆడియంలో నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా స్పీకర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్, పోలీసు, నీటిపారుదల, ప్రాజెక్టుల నిర్మా ణం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినందునే, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి సింహావలోకనం చేసుకొనేందుకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ప్రాధాన్యతా క్రమంలో జూన్ 2 నుంచి 22 వరకు వివిధ శాఖలకు సంబంధించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలీసు శాఖలో ఆధునిక మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 160 బైకులు, 100 ఇన్నోవా, బొలెరో వాహనాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నామని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి మండలానికి పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో నేరాలు, ఘోరాలు ఎక్కడ జరిగినా నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకోగలుగుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకువచ్చి ప్రజల సమస్యలను ఫ్రెండ్లీగా పరిష్కరిస్తూ సేవలందిస్తున్నారని సభాపతి పోచారం తెలిపారు. నేరాలను తగ్గించడంలో పోలీసులు చురుకుగా వ్యవహరిస్తుండడంతో క్రమంగా నేరాల శాతం తగ్గుతోందన్నారు. సమైక్య రాష్ట్రంలో పాస్పోర్టు వెరిఫికేషన్ కావాలంటే నెలలు వేచి చూడాల్సి వచ్చేదన్నారు. స్వరాష్ట్రంలో దేశ విదేశాలకు ఉపాధి, చదువు కోసం వెళ్లే వారికి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో పాస్పోర్టు వెరిఫికేషన్ను త్వరగా పూర్తి చేస్తున్నారని అన్నారు. వెరిఫికేషన్లో తెలంగాణ పోలీసు ఎనిమిదేండ్లుగా దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నారని, ఇది వారి నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. బాలికలు, మహిళల సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మహిళా సంరక్షణకు షీ టీములు, సఖీ సెంటర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతి నెలకొనడంతో నేడు 22వేల పరిశ్రమలు వచ్చాయని, సుమారు 9లక్షల మంది యువకులకు వివిధ రకాలుగా ఉపాధి లభించిందని అన్నారు. ఎస్పీ శ్రీనివాస్రెడ్డి 1994లో బాన్సువాడ ఎస్సైగా పని చేశారని, నేడు జిల్లా ఎస్పీగా ఎదిగారని, ఆయన నేతృత్వంలో జిల్లాలో పోలీసులు ఎంతో చక్కగా పని చేస్తున్నారని ప్రశంసించారు.
ఎస్పీ ఆఫీసు చూసి ఆశ్చర్యపోతున్నారు
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా కావడంతో పాటు సువిశాలమైన స్థలంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించారని, వీటిని చూసి ఇతర రాష్ర్టాల అధికారులు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో నేడు రాష్ట్రంలో నేరాలు తగ్గడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పోలీసులు పాలు పంచుకొంటున్నారని అభినందించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ పోలీసులు నేడు గ్రామగ్రామాన విస్తరించారని, దీంతో గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నదని అన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోలీసులకు మంచి జీతాలు, ఆధునిక వాహనాలు, కొత్త టెక్నాలజీ సమకూర్చడం వల్ల దేశంలోనే నంబర్ వన్ స్థాయిలో ఉన్నారని అన్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ ఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పోలీసులు ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన పోలీసులకు సేవా పతకాలను అందజేశారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్రెడ్డి ‘నాడు-నేడు’పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
పోలీసు ర్యాలీకి భారీ స్పందన
సురక్షా దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు నిర్వహించిన ర్యాలీకి ప్రజలు నీరాజనం పట్టారు. ప్రజలు, విద్యార్థులు పూలను వెదజల్లుతూ స్వాగతం పలికారు. పోలీసులపై పూల వర్షం కురిపించారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ, జై తెలంగాణ, జైజై తెలంగాణ, జై పోలీసు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్ దోత్రే, శివేంద్ర ప్రతాప్, చంద్రమోహన్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ తదితరులు పాల్గొన్నారు.