వర్ని, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామా లు అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలోని రామాలయం వద్ద దాసరి వెంకటరత్నం-వెంకట రత్నమ్మ జ్ఞాపకార్థం కుమారుడు దాసరి రామకృష్ణ నిర్మించిన భోజనశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి ద్వారా పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి పల్లెలను అభివృద్ధి చేసిన ఘనత కేవలం సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కిందన్నారు.
500పైబడి జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించి, పాలనను సులభతరం చేసి వాటి అభివృద్ధికి విరివిగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ, పాఠశాల భవనాలు నిర్మించి గ్రామాల్లో కనీస సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో -ఆప్షన్ సభ్యుడు కరీం, గ్రామ సర్పంచ్ రాజు, సహకార సంఘాల అధ్యక్షుడు నామాల సాయిబాబ, కృష్ణారెడ్డి, కనకారెడ్డి, రైతుబంధుసమితి మండల కన్వీనర్ సింగంపల్లి గంగారాం, సర్పంచులు పద్మా నాగభూషణం, మైసం వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
వర్ని మండలం సైద్పూర్ గ్రామంలోని సేవాలాల్ మహరాజ్ మందిర వార్షికోత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భోగ్భండార్లో ఆయన పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుకా రవి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.