రైతుబంధుతో వ్యవసాయరంగానికి దిక్సూచిలా నిలిచిన సీఎం కేసీఆర్.. రైతుబీమా పథకంతో అన్నదాతలకు ఆత్మబంధువుగా మారారు. రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలను ఆపద సమయంలో ఆదుకుంటున్నది. భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న రైతు కుటుంబ యజమాని మరణిస్తే వారికి చేదోడుగా ఉండాలని, 18 నుంచి 59ఏండ్ల వయస్సున్న రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ.5లక్షలు అందేలా ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నది. ఐదేండ్లలో కామారెడ్డి జిల్లాలో 5,836 మంది రైతులు మరణించగా.. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున రూ.299.40 కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. ఐదేండ్లు పూర్తి చేసుకున్న రైతుబీమా పథకం… ఆరో యేట అడుగిడుతున్నది. ఈ సందర్భంగా కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది
కామారెడ్డి, జూలై 15 (నమస్తే తెలంగాణ): కుటుంబానికి పెద్ద అయిన రైతు మరణిస్తే, ఆయనపై ఆధారపడిన వారి కుటుంబసభ్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఉన్న కొంత చేనును అమ్ముకొని అప్పులు తీర్చడమో, పిల్లల చదువు కోసమో, కూతురు పెండ్లి చేయడమో, ఉండడానికి ఇల్లు నిర్మించుకోవడమో చేయాల్సి వస్తుంది. అయితే రైతన్న మరణిస్తే ఆ పరిస్థితుల నుంచి గట్టేందుకు సీఎం కేసీఆర్ తన మదిలో ఉన్న సంక్షేమ పథకాల్లో ఒకటైన రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆపదలో ఈ పథకం రైతు కుటుంబానికి అండగా నిలుస్తున్నది. రైతు బీమాను ప్రవేశపెట్టి ఐదేండ్లు పూర్తయ్యింది. 2018 ఆగస్టు 14న ప్రవేశపెట్టిన ఈ బీమా పథకం ఆరో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ సందర్భంగా ఆగస్టు 5 వరకు రైతుబీమా కోసం కొత్తగా భూమి కొనుగోలు చేసి, పట్టాదారు పాసు పుస్తకాలను పొందిన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 5,836 మంది రైతులు మరణించగా, రైతుబీమా పథకంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.299.40 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు.
పైసా భారం లేకుండా పథకం అమలు..
రైతుబీమా పథకాన్ని పొందేందుకు సదరు రైతు పేర ఒక్క గుంట భూమి ఉన్నా చాలు. అతను అర్హుడే. బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ నిబంధనల ప్రకారం 18 నుంచి 59 ఏండ్ల వయస్సు గల రైతులు అర్హులు. రైతుబంధు పథకం వర్తిస్తున్న రైతులందరికీ రైతుబీమా వర్తిస్తుంది. ప్రభుత్వమే రైతుపేరిట ప్రతి ఏడాది సుమారు వేల రూపాయల ప్రీమియాన్ని చెల్లిస్తున్నది. రైతు ప్రమాదవశాత్తు మరణించినా, సహజ మరణం పొందినా అతని కుటుంబానికి రూ.5లక్షలను చెల్లిస్తారు. రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న ఈపథకంతో ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతున్నా, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రీమియాన్ని చెల్లిస్తున్నది. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,99,044 మంది రైతులకు సంబంధించిన రూ.79.61కోట్ల ప్రీమియాన్ని చెల్లించింది. అకాల మరణం పొందిన రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. అప్పులు తీర్చుకోవడం, పిల్లలను చదివించడం, వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం, పెండ్లిలు చేయడం జరుగుతున్నది. రైతు మరణించిన వారం, పదిరోజుల్లోపే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అధికారులే పూర్తి నివేదిక సమర్పించి బీమా చెక్కులను రైతు కుటుంబానికి అందిస్తున్నారు.
కొత్త రైతులకు బీమా వర్తింపు..
రైతు బీమా పథకంలో 2023-24లో చేరుతున్న రైతులకు ఆగస్టు 14 నుంచి ఈ పథకం వర్తిస్తుంది. 18 నుంచి 59 ఏండ్లు ఉన్న వారికి మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంటుంది. ప్రతి ఏడాది ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమలవుతున్నది. ఇప్పటికే రైతు బీమాలో ఉన్న రైతుల్లో 59 ఏండ్లు దాటిన వారిని తొలగిస్తారు. కొత్తగా రైతు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన అర్హులైన రైతులను చేర్చుకుంటారు. జిల్లాలో గత జూన్ 18 నాటికి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులను రైతుబీమా పథకంలోకి తీసుకుంటారు. వీరంతా బీమా పథకంలో చేరాలంటే రైతు బీమా దరఖాస్తు ఫారంతోపాటు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో స్వయంగా సంబంధిత రైతే వచ్చి వ్యవసాయ అధికారులకు సమర్పించాలి. రైతుకు బదులుగా మరొకరు వచ్చి దరఖాస్తు ఇస్తే తీసుకోబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 5 వరకు సంబంధిత ఏఈవో, మండల వ్యవసాయ అధికారులకు అందించాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుబీమాలో ఉ న్న రైతులు తమ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు జరిగితే సవరించుకొనే అవకాశం కల్పించారు. నామినీ మరణించినా, కొత్త నామినీ ఆధార్ కార్డును అందజేయాల్సి ఉంటుంది.
రైతులు దరఖాస్తు చేసుకోవాలి…
కొత్తగా భూములను కొనుగోలు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులంతా పథకంలో చేరాలి. రైతులందరికీ ఏఈవోలు అందుబాటులో ఉంటారు. ఏఈవోలు లేనిపక్షంలో మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. రైతు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ఆగస్టు 5లోపు దరఖాస్తులు అందజేయాలి.
-వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి