నిజామాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తున్నది. పెట్టుబడి సాయం వచ్చినట్లు ఫోన్లకు మెస్సేజ్లు వస్తుండడంతో కర్షకులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. యాసంగి సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు సమయానికి డబ్బులు చేతికందుతుండడంతో ఉత్సాహంగా పొలం బాటపడుతున్నారు. ఊరు ఊరంతా సీఎం అందిస్తోన్న పదో విడుత రైతుబంధు సాయంపైనే జోరుగా చర్చించుకుంటూ ఆపదలో ఆదుకుంటున్న కేసీఆర్ను కొనియాడుతున్నారు. ఐదేండ్లుగా ఇచ్చిన మాట ప్రకారం నిరంతరాయంగా సాగుకు పెట్టుబడిని అందిస్తూ అన్నదాతలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విడుతల వారీగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతూనే ఉన్నది.
గ్రామాల్లో ఇప్పుడు ఎటు చూసినా రైతుల మోములో ఒకటే ఉత్సాహం.. ఏ ఇంటివైపు చూసినా రైతుబంధు ముచ్చటే.. ఏ రైతును కదిలించినా పెట్టుబడి సాయంపైనే చర్చ. ఊరు ఊరంతా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పదో విడుత రైతుబంధు సాయం గురించే మాట్లాడుకుంటూ సీఎం కేసీఆర్ను కొనియాడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఐదేండ్లుగా నిరంతరాయంగా సాగుకు పెట్టుబడిని అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. గతమంతా కన్నీళ్ల పర్యంతమైన సాగును సంబురంగా మారుస్తున్నారు. హలధారి ముఖంలో ఆనందాన్ని నింపుతున్నారు. గుంట భూమి ఉన్న రైతు నుంచి.. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతిఒక్కరికీ ఎకరాకు ఏదాడికి రూ.10వేల చొప్పున రైతుబంధు నగదును జమ చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ ప్రియారిటీ ప్రకారం రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతూనే ఉంది. అప్పులు, వడ్డీలు, ఉద్దెరల వంటి ఇబ్బందులకు శాశ్వతంగా దూరమై అన్నదాతలంతా.. తమ కాళ్లపై తాము నిలబడి భూములను ఉత్సాహంగా సాగు చేసుకుంటున్నారు.
సంక్షోభం నుంచి బయటకు..
కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటగా సంక్షోభంలో చిక్కుకున్న రైతులను గట్టెక్కించడానికి శ్రీకారం చుట్టారు. ఆయన స్వయంగా రైతు బిడ్డనే కావడంతో వ్యవసాయరంగ సమస్యలు, పరిష్కార మార్గాలపై స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో వినూ త్న పథకాలను తీసుకువచ్చారు. బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను కల్పించి కర్షకలోకం ఊహించిన దానికన్నా రెట్టింపు సహాయక చర్యలను చేపట్టారు. మిషన్ కాకతీయ పథకం, సాగునీటి సంకల్పం, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు వంటివి ఆ కోవకు చెందినవే. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5 వేల పెట్టుబడి సాయాన్ని పది సీజన్ల నుంచి అందుతున్నది. రైతు అకస్మాత్తుగా చనిపోతే పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ద్వారా వారం రోజుల్లోనే రూ.5లక్షల నగదు అందుతున్నది. రైతు పండించిన చివరి గింజనూ కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తున్నది. ఇవన్నీ చేస్తామని 2014కు ముందు జరిగిన ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించనే లేదు. ఇవన్నీ చేయాలని కేసీఆర్ను రాష్ట్ర రైతాంగం కోరనూ లేదు. కానీ అన్నదాత సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తుండడంపై ఆయా వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతన్నాయి.
ప్రభుత్వం చేపట్టిన చర్యలు..
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన కరెంటును అందిస్తున్నది. తద్వారా మాటిమాటికీ మోటర్లు కాలిపోయే ఇబ్బందుల నుంచి రైతుకు ఉపశమనం లభించింది. పంటలు ఎండిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ చెరువులకు మరమ్మతులు నిర్వహించడంతోపాటు నీటినిల్వ సామర్థ్యం పెంచింది. దీంతో భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. బీడువారిన పంట పొలాలకు నీరందించి సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం ద్వారా ఉమ్మడి జిల్లాకు మేలును తలపెట్టారు. దీనికితోడు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఆయకట్టు రైతులకు లాభం చేకూర్చారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో కాలువల ఆధునికీకరణతో సంబంధిత రైతులకు ధైర్యాన్ని నింపారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక విధాలుగా సాగు రంగాన్ని విప్లవాత్మకంగా మలిచి మేలును తలపెట్టడం ద్వారా దేశ వ్యాప్తంగా రైతు ప్రభుత్వంగా బీఆర్ఎస్ సర్కారు పేరొందింది. అందుకే జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన గులాబీ పార్టీ.. నూతన ఎజెండా ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదం సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నది.
రైతుబంధు పైసలొచ్చినయ్…
భీమ్గల్: రైతుల గోస తెలిసిన కేసీఆర్ సీఎం కావడం మా అదృష్టం. పొలం పనులు ప్రారంభంలోనే రైతుబంధు పైసలు వచ్చినయ్. చాలా సంతోషంగా ఉన్నది. యాడ గూడా ఇలాంటి పథకం లేదు. మాకు అనేక రకాలుగా ఆదుకుంటున్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– ఆరె నడ్పి రాజన్న, రైతు, మెండోరా , భీమ్గల్
దేశ్కీ నేత కేసీఆర్..
బాల్కొండ: కేసీఆర్ నిజమై న రైతు నాయకుడు . ఏడాదిలో రెండు పంటలకూ డబ్బు లు ఇస్తున్నారు. ఇలాంటి పథ కం వేరే ఏ రాష్ట్రంలో లేదు. కేసీఆర్ దేశ్ కీ నేత కావాలి.
– వాహెబ్, రైతు, బాల్కొండ
మా పాలిట దేవుడు..
ఏర్గట్ల: గతంలో మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదు. కేసీఆర్.. రైతులపాలిట దేవుడు. ఆయనకు మా కష్టాలన్నీ తెలుసు. అందుకే ప్రతి సీజన్లో ఎరువులు, విత్తనాల కోసం మా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు.
–నరేందర్యాదవ్, రైతు, బట్టాపూర్, ఏర్గట్ల
ఇంటి మనిషి లెక్క..
కమ్మర్పల్లి: కేసీఆర్ సారు మా ఇంటి మనిషి లెక్క. ఎవుసం పనులు మొదలువెట్టంగనే రైతుబంధు పైసలు పంపుతడని ఆయనే గుర్తుకు వస్తడు. సూడంగ సూడంగనే పైసలు వడ్డట్లు ఫోన్ల మెసేజ్ రానే వత్తది. రైతుమీద పట్టి ఉన్న నాయకుడి పనంటే గిట్లుంటది.
–తెడ్డు నాగమ్మ, మహిళా రైతు, హాసాకొత్తూర్, కమ్మర్పల్లి