కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మొద్దు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ఇందల్వాయిలో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్
ఇందల్వాయి, సెప్టెంబర్ 23: త్వరలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందల్వాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆర్అండ్బీ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందల్వాయి గ్రామం లో సుమారు 50 ఇండ్లు నిర్మిస్తున్నామని, 99 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి మండలంలో పలు అభివృద్ధి పనులు చేపటినట్లు తెలిపారు. ఇంతవరకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. త్వరలోనే మండలంలోని ప్రతి గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఆర్టీసీ చైర్మన్ వెంట డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, వైస్ ఎంపీపీ అంజయ్య, పార్టీ మండల అధ్యక్షుడు చిలివేరి దాసు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్, సర్పంచ్ సత్తెవ్వ, సీనియర్ నాయకులు పాశం కుమార్, మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.