గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆర్టీసీ విలీన బిల్లును నొక్కిపట్టడంపై కార్మికులు గళమెత్తారు. ప్రజాసంక్షేమాన్ని కాదని పక్కా రాజకీయాలు చేస్తున్న వైనంపై మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు విధులు బహిష్కరించి డిపోల ఎదుట బైఠాయించారు. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నీచ రాజకీయాలు మానుకోవాలని, తమ భవిష్యత్తుకు సంబంధించిన బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. సంక్షేమానికి సంబంధించిన బిల్లులకు ‘నై’ అంటున్న గవర్నర్.. కయ్యానికి ‘సై’ అంటున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 5 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదిలోనే అడ్డుకోవడంపై కార్మికులు మండిపడ్డారు. తమ కష్టాలను సీఎం కేసీఆర్ గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ కనుసన్నల్లో నడుచుకునే ఆమె.. విలీనం బిల్లుపై అభ్యంతరం తెలుపడం దుర్మార్గపు చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తీరుకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో శనివారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారుజామునే డిపోల ఎదుట బైఠాయించి ధర్నాలు నిర్వహించారు. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సహకరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ డిపోల వద్ద దాదాపు మూడు గంటలపాటు నిరసన కార్యక్రమాలు కొనసాగడంతో బస్సులు కొంతసేపు డిపోలకే పరిమితమయ్యాయి.
సహకరించకపోతే తీవ్ర పరిణామాలు..
కామారెడ్డి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గవర్నర్ సౌందరరాజన్ సహకరించకపోతే ఊరుకునేది లేదు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సిబ్బంది స్వాగతించారు. కానీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అడ్డుకోవడం బాధాకరం. ఆమెకు కార్మికలోకం నుంచి నిరసన సెగలు తప్పవు..
-మూర్తి, డ్రైవర్, కామారెడ్డి డిపో
ఆనందం ఆవిరైంది..
కామారెడ్డి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మమ్మల్ని సర్కారు ఉద్యోగులుగా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఎంతో సంతోషించాం. కానీ విలీనం బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై అనుమతించకపోవడంతో ఆనందం ఆవిరైంది. ఒక మహిళగా.. కార్మికుల కష్టాలను గుర్తించకపోవడం సిగ్గుచేటు.
-లక్ష్మి, కండక్టర్, కామారెడ్డి డిపో
కార్మిక కుటుంబాల ఉసురు తప్పదు..
కామారెడ్డి: మేము బాగుపడడం గవర్నర్కు నచ్చకపోవడం దుర్మార్గం. ఆమెకు కార్మిక కుటుంబాల ఉసురు తగులు తుంది. ఎన్నో కష్టాలతో నెట్టుకొస్తున్న మాకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మారిస్తే మా జీవితాల్లో వెలుగులు నిండుతాయి.
-వెంకటేశ్, డ్రైవర్, కామారెడ్డి డిపో
మా ఆశలను నీరుగార్చొద్దు..
కామారెడ్డి: ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మాకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పిండు. మా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. కానీ విలీనం బిల్లును గవర్నర్ అడ్డుకొని మా ఆశలను నీరుగార్చింది. మా కుటుంబాలు బాగుపడకుండా ప్రయత్నిస్తే ఎంతకైనా తెగిస్తాం.
-పుష్పలత, కండక్టర్, కామారెడ్డి డిపో
దేవుడు వరమిస్తే పూజారి అడ్డుకున్నట్లు..
బాన్సువాడ టౌన్: దేవుడు వరమిస్తే పూజారి అడ్డుపడ్డట్లున్నది గవర్నర్ తమిళిసై తీరు. మమ్మల్ని కష్టాలనుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తుంటే ఆమె అడ్డుకోవడం ఏంటి? రాజ్భవన్ ఏసీ గదిలో కూర్చుంటే ఏం తెలుస్తుంది..? మాతో ఒక్కరోజు కలిసి పనిచేస్తే మా బాధలు తెలుస్తయ్..
-సునంద, కండక్టర్, బాన్సువాడ డిపో
గవర్నర్కు మా సత్తా చూపిస్తం..
బాన్సువాడ టౌన్: తెలంగాణ కోసం అప్పటి ఆంధ్రా పాలకులకు ఆర్టీసీ కార్మికుల పట్టు ఏమిటో చూపించాం. విలీనం బిల్లుపై అనుకూలంగా స్పందించకపోతే గవర్నర్కూ మా సత్తాను చూపిస్తం. కర్మికులకు మంచి జరుగుతుంటే గుజరాతీ ఉద్యోగి ఓర్చుకోవడం లేదు.
-హైమద్, డ్రైవర్, బాన్సువాడ డిపో
దుర్మార్గపు చర్య..
బాన్సువాడ టౌన్: ఎన్నో ఏండ్ల ఆర్టీసీ కార్మికుల కల సాకారం అయ్యే సమయంలో విలీనం బిల్లును గవర్నర్ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. కార్మికులు బాగుపడడం ఓర్వలేని బీజేపీ అధిష్టానం కనుసన్నల్లో తమిళిసై నడుస్తున్నారు. కార్మికుల పట్టును చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
-గోపీకృష్ణ, సిస్టం ఆపరేటర్, బాన్సువాడ డిపో
మా కడుపు కొడితే ఊరుకోం..
బాన్సువాడ టౌన్: ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలి. మా కుటుంబాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే.. గవర్నర్ తమిళిసై మా కడుపు కొట్టాలని చూస్తున్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి రాజకీయాలు, కుట్రలకు పాల్పడతే ఊరుకునేది లేదు.
-నరేశ్, కండక్టర్, బాన్సువాడ డిపో