వర్ని, డిసెంబరు 27 : రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రోడ్లను ప్రజలే కాపాడుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. వర్ని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వర్ని, రుద్రూరు, కోటగిరి, చందూరు, మోస్రా, పొతంగల్ మండలాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు కేజ్వీల్ ట్రాక్టర్లను రోడ్లపై నడుపుతూ ధ్వంసం చేస్తున్నారని, దీంతో ప్రజాధనం వృథా అవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్లపై కేజ్వీల్ ట్రాక్టర్లను తిప్పొద్దని రైతులకు సూచించారు. అంతకుముందు అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన పడిపూజలో స్పీకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్, మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, రుద్రూరు జడ్పీటీసీ నరోజీ గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ విజయలక్ష్మి, సహకార సంఘం అధ్యక్షుడు సాయిబాబా, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, మూడ్ అంబర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.