నిజామాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులతో శుక్రవారం మంత్రి వేల్పూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలకు తమ తమ గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, పంచాయతీ రాజ్,ఆర్ అండ్ బీ పరిధిలోని రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు, కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
వర్షాలుకాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత తెగిపోయిన చెరువులు, రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్ధరణ, మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.
శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాలు ప్రస్తుతానికి కొంత శాంతించిన..మళ్లే వస్తే స్థానిక ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.