నందిపేట్, డిసెంబర్ 10 : దైవ దర్శనానికి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు వేటాడింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో 63వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నందిపేట్ మండలానికి చెందిన ఉమ్మెడ అశోక్ (26), మంద మోహన్ (24), రమేశ్ (26) స్నేహితులు. అశోక్కు ఇటీవల కుమారుడు జన్మించడంతో, కొండగట్టుకు వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అనుకున్నాడు. తన ఇద్దరు మిత్రులతో కలిసి శనివారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి కారులో బయల్దేరారు.
ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులోని క్షత్రియ కాలేజీ వద్ద ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. కారు లారీ కిందికి దూసుకెళ్లడంతో అందులో ఉన్న ముగ్గురు మిత్రులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కొండగట్టు దర్శనానికి బయల్దేరిన అరగంటలోనే రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. అశోక్ తండ్రి ఐదేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందగా, శనివారం జరిగిన ప్రమాదంలో అశోక్ దుర్మరణం చెందాడు. ఏకైక కుమారుడు అయిన మోహన్కు ఇక ఇంట్లో పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ తరుణంలో అతడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న రమేశ్.. ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబం అనాథగా మారింది. ముగ్గురు యువకులు దుర్మరణం చెందడంతో నందిపేట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.