మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐ తీసుకోవాలి
40 రోజులుగా రైస్ మిల్లులు మూలన పడ్డాయి..
రైస్మిల్ అసోసియేషన్ ప్రతినిధుల ఆవేదన
నిజామాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని రైస్మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య ఏర్పడిందని, 40 రోజులుగా పరిశ్రమ మూగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు పని లేకపోవడంతో స్వరాష్ర్టాలకు వెళ్లి పోతున్నారని చెప్పారు. రైస్మిల్లు పరిశ్రమ అంటే ఒక యజమానికి మాత్రమే సం బంధించినది కాదని తెలిపారు. దీని వెనుక రైతు భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు.
ఎఫ్సీఐ ప్రొ క్యూర్మెంట్ నిలిపివేయడంతో రైస్మిల్ ఇండస్ట్రీకి ఎదురైన గడ్డు పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైస్భవన్లో శుక్రవారం ఆ యన ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడారు. మిల్లర్లకు ధాన్యం మర ఆడించేందుకు రాష్ట్ర ప్రభు త్వం అండగా నిలిచిందని, బియ్యాన్ని సేకరించి కేంద్రం కూడా అదే స్ఫూర్తిని చాటాలని కోరారు. గ్రామాల్లో రైస్ మిల్లులే అధికమని వాటిని కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ రాక ముందు 1700 మిల్లుంటే స్వరాష్ట్రంలో ఇం డస్ట్రీ విస్తరించిందని చెప్పారు. ప్రస్తుతం 3400 మిల్లులు ఉన్నాయన్నారు. మిల్లింగ్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సహకరిస్తోందని చెప్పారు. ఏడేండ్లుగా సహకరిస్తూ వచ్చిన కేంద్రం మాత్రం అకస్మాత్తు గా ప్రొక్యూర్మెంట్ నిలిపి వేసింద న్నారు. వేతనాలు చెల్లించలేక, బ్యాంక్ రుణాలను కట్టలేక చతికిల పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రైస్ మిల్లుల వద్ద 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పేరుకుపోయిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి మొలకలు వస్తున్నాయన్నారు.
తప్పుంటే మేమే శిక్షిస్తాం…
తప్పుడు సమాచారంతోనో, ఒక శాతం మంది చేసిన తప్పులను దృష్టిలో పెట్టుకుని వేలాది రైస్ మిల్లులు మూత పడేలా వ్యవహరించవద్దని కో రారు. మిల్లర్లు తప్పు చేస్తే రెవెన్యూ రికవరీ ద్వా రా యాక్షన్ తీసుకోవాలన్నారు. నిల్వలు లేకుంటే 420 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. తమకు రాష్ట్రం, కేంద్రంతో పంచాయితీ లేదన్నారు. కేంద్రం బియ్యం తీసుకుని సహకరించాలని, దీనిపై మంత్రి కిషన్రెడ్డి స్పందించాలని కోరారు.
రైతులపై ప్రభావం…
రైతులు ఇబ్బంది పడినప్పుడు ఇండస్ట్రీ అండగా నిలిచిందని, ఇండస్ట్రీ ఇబ్బంది పడుతున్నప్పుడు రైతులు అండగా నిలవాలని కోరారు. వరి సాగు పెంచాలంటూ కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ కోరుతున్నారని, తెలంగాణ రైతులు అందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మేధావులు, వ్యవసాయ నిపుణులు, పరిశ్రమ పెద్దలంతా ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో సెం ట్ భూమి ఖాళీగా లేకుండా పంటలు పండిస్తారని అన్నారు. వచ్చే ధాన్యం ఎక్కడ నిల్వ ఉంచాలని ప్రశ్నించారు. ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగ స్ఫూర్తిని చాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. బియ్యం సేకరణ జరుగుతోందని బండి సంజయ్ చెప్పినప్పటికీ ఇంత వరకు ఎఫ్సీఐ ఆ పని మొద లు పెట్టలేదన్నారు. ఎఫ్సీఐ జీఎంను అడిగితే తమకు ఆర్డర్ రాలేదంటున్నారని రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. సమావేశం లో సంఘం జిల్లా అధ్యక్షుడు దయానంద్ గుప్తా, ఉపాధ్యక్షుడు పెంబర్తి శ్రావణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.