మెండోరా, డిసెంబర్ 14 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్, కాకతీయ, లక్ష్మీ కాలువల నిర్వహణకు గతంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. కాలువలు, ప్రాజెక్టు పైన పిచ్చిమొక్కలు, చెట్లు భారీగా పెరిగి అడవిని తలపించేది. అక్టోబర్ నెలలో ఎస్సారెస్పీ సర్కిల్కు 11 మంది వీఆర్ఏలు వచ్చారు. 14 మంది హెల్పర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టుపై 9 మంది విధులు నిర్వహిస్తుండగా కాకతీయ, లక్ష్మీ కాలువలకు మిగతా హెల్పర్లను నియమించింది. కొంతకాలంగా లష్కర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయకట్టుకు కాలువ ద్వారా నీరందడం గగనంగా మారింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించడంతో ఆయకట్టు రైతులకు సమయానుసారంగా నీటిని అందిస్తున్నారు. అంతేగాకుండా ప్రాజెక్టుపైన ఉన్న పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించి ప్రాజెక్టు అందాలను కాపాడుతున్నారు.
కాలువల ద్వారా నీటి విడుదల చేసినప్పుడు వారికి కేటాయించిన కిలోమీటర్ల వరకు కాలువను పర్యవేక్షించాలి. పూడిక, పిచ్చిమొక్కలు, కాలువపై ఉన్న పరిధి వరకు జంగల్ క్లియరెన్స్ చేపట్టాలి. చివరి ఎకరా వరకు ఆయకట్టు ద్వారా నీటినందించాలి. దీంతో ఆనకట్టపై పిచ్చిమొక్కల తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంతేగాకుండా కాలువ వెంట నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ప్రాజెక్టుపై సిబ్బంది కొరత లేకపోవడంతో పనులు చకచకా సాగిపోతున్నాయని అధికారులు అంటున్నారు. అదేవిధంగా గతంలో కాలువ వెంట పిచ్చిచెట్లు ఏపుగా పెరగడంతో కాలువకు గండ్లు కూడా పడుతుండేవి. దీంతో రైతులు పొలాలకు నీరందక భారీగా నష్టపోయేవారు. ఇప్పుడు అలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సిబ్బంది కొరతతో అనేక సమస్యలు వచ్చేవి. ప్రస్తుతం సిబ్బందిని, లష్కర్లను నియమించడంతో ఎస్సారెస్పీ అధికారులు ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తూ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.