విద్యానగర్/ఖలీల్వాడి, జనవరి 1 : నేడు వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయాలకు రంగులు వేసి, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొన్ని ఆలయాల్లో ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉత్తర తిరుపతి క్షేత్రం, జెండా బాలాజీ ఆలయం, కామారెడ్డి జిల్లాకేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలోని ప్రసన్న వేంకటేశ్వర ఆలయం, గోపాల్ స్వామి రోడ్లోని గోపాల్ స్వామి ఆలయాలు వేడుకలకు ముస్తాబయ్యాయి.