కామారెడ్డి ప్రభుత్వ జిల్లా దవాఖానలో ఓ రోగిని ఎలుక కరిచి గాయపర్చిన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయగా.. సూపరింటెండెంట్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దవాఖానలోని ఐసీయూ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డికి చెందిన ముజీబుద్దీన్ మెదడుకు సంబంధించిన సమస్యతో దవాఖానలో చికిత్స పొందుతుండగా శనివారం రాత్రి ఆయన చేతి వేళ్లు, కాళ్లను ఎలుక కొరకడంతో గాయాలయ్యాయి. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించగా ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ను అజయ్కుమార్ను విచారణకు ఆదేశించగా.. ఆయన కామారెడ్డి దవాఖానను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ చేపట్టిన విచారణలో వైద్యాధికారుల నిర్లక్ష్యం బయటపడింది.
గత కేసీఆర్ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించింది. రోగులకు కార్పొరేట్ వైద్యం అందించడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ప్రభుత్వ దవాఖానలపై ప్రతి ఒక్కరికీ భరోసా ఏర్పడింది. ప్రతి పీహెచ్సీలోనూ అన్ని రకాల వ్యాధులకు మందులతోపాటు సరిపడా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచింది. ప్రతి గ్రామంలో అత్యవసర పరిస్థితుల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందించి ప్రజల మన్ననలు పొందింది. ఉమ్మడి జిల్లాలో దవాఖానలకు సొంత భవనాలు నిర్మించి, కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. దవాఖానలకు వచ్చే ప్రతి రోగిని పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నది.
కామారెడ్డి జిల్లా దవాఖానలో రోగిని ఎలుక కరిచిన ఘటనలో ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వైద్యాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ ఘటనపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రభుత్వానికి నివేదిక పంపించగా.. వైద్యారోగ్య అధికారులు ఆరా తీశారు. విచారణలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం కనబడడంతో ఐసీయూలో ఉన్న వైద్యురాలు డాక్టర్ కావ్య, ఇన్చార్జి జనరల్ మెడిసిన్ వైద్యుడు సంపత్ కుమార్, స్టాఫ్ నర్స్ మంజులపై అధికారులు వేటు వేశారు. ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు.