గిరిజనులు నివసించే తండా అనగానే అడవిలో దొరికే కట్టెలతో నిర్మించుకున్న గుడిసెలు, రేకుల ఇండ్లు అని ఊహించుకుంటాం. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో గిరిజన పల్లెలు అభివృద్ధిబాట పట్టాయి. హరితహారం, పల్లెప్రగతితోపాటు సీసీరోడ్లు, ఇండ్లు మంజూరు చేయడంతో తండాలు మెరిసిపోతున్నాయి. పట్టణాలను తలపిస్తున్నాయి.
వర్ని, ఏప్రిల్ 16 : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్లా నాయక్ తండాలో 40 గిరిజన కుటుంబాలు ఆవాసం ఏర్పర్చుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆ గిరిజన గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కనీసం తాగునీటి వసతి కూడా సరిగా ఉండేది కాదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఆ తండా.. బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో తన రూపు రేఖలను మార్చుకొని పట్టణంలోని కాలనీని తలపిస్తున్నది. దీంతో ఇంటింటా ఆనందం వెల్లి విరుస్తున్నది.
తండాలోని 18 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్పీకర్ పోచారం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేశారు. హరితహారంతోపాటు పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటుచేసిన విలేజ్ పార్కుతో గ్రామం పచ్చదనాన్ని సంతరించుకున్నది. ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం కింద నల్లాలను బిగించి శుద్ధజలం సరఫరా అవుతున్నది. 14 మందికి ప్రతినెలా ఆసరా పింఛన్లు అందుతున్నాయి. సుమారు 20 కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధి చేకూరింది. వీటితో పాటు తండా వాసుల కోరిక మేరకు తగిలేపల్లి గ్రామం నుంచి రూప్లానాయక్ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి స్పీకర్ పోచారం రూ. 80 లక్షల నిధులు మంజూరు చేశారు. తండాలోని సేవాలాల్ మహరాజ్ ఆలయ అభివృద్ధికి మరో రూ. 10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
స్పీకర్ పోచారం కృషితోనే..
రూప్లానాయక్ తండా తగిలేపల్లి గ్రామ పరిధిలో ఉంటది. అక్కడ అందరూ గిరిజనులె. గుడిసెలు, పెంకుటిండ్లు ఉండేవి. సరైన సౌకర్యాలు లేక తండావాసులు చాలా ఇబ్బందిపడేవారు. తెలంగాణ సర్కారు వచ్చినంక తండాలను చాలా అభివృద్ధి చేసింది. మా ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో అందరూ ఇండ్లు కట్టుకున్నరు. తండాలో ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. బీటీ రోడ్డు కోసం కూడా నిధులు మంజూరు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
– మైసం వెంకటేశ్వర్లు, సర్పంచ్, తగిలేపల్లి
తెలంగాణ అచ్చినంక బాగుపడ్డాం..
మేం గుడిసెలళ్ల బతికెటోళ్లం. ఎండకాలంల అగ్గి అంటుకొని గుడిసెలు కాలిపోయేటివి. ఎప్పుడు ఏమైతదోనని భయపడెటోళ్లం. తెలంగాణ అచ్చినంక మా బతుకులు మారినయ్. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం సార్లు దేవుండ్ల లెక్క ఆదుకున్నరు. గరీబోళ్లకు ఇండ్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు చాలా మంది డాబాలు కట్టుకున్నరు. తండాలో చాలా సౌలత్లు చేసిండ్రు
– కాట్రోత్ సక్రీబాయి, డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు, రూప్లానాయక్ తండా