నిజామాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పత్తి రైతులను దగా చేయడం షరా మామూలుగానే కొనసాగుతున్నది. ఆరుగాలం శ్రమించి పంట పండించిన కర్షకులు నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చేపట్టాల్సిన కొనుగోళ్ల ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతుండడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. పట్టించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ మాత్రం కనీసం పట్టింపు లేనట్లుగానే వ్యవహరిస్తున్నాడు. నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాల్లోని పలు చోట్ల నీటి వసతిని అంచనా వేసి నేల స్వభావం మేరకు పత్తిని సాగు చేస్తున్నారు. వీరంతా పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మద్దతు ధర కన్నా తక్కువకే విక్రయించుకుంటున్నారు. రైతుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు మహారాష్ట్ర నుంచి వ్యాపారులు రంగంలోకి దిగి ఎమ్మెస్పీ కన్నా తక్కువకే కొనుగోలు చేసి డబుల్ ఆదాయం ఆర్జిస్తున్నారు. పత్తి కొనుగోలు చేసే పక్క రాష్ట్రం వ్యాపారులంతా బీజేపీకి చెందిన వారేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పత్తిని సేకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాదే. పత్తి సాగును అంచనా వేసి వారికి నష్టం వాటిల్లకుండా కేంద్రాలను నెలకొల్పి కనీస మద్దతు ధరతో పత్తిని కొనాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ప్రతిసారి జుక్కల్ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దు మద్నూర్లోనే సీసీఐ కొనుగోలు కేంద్రం తూతూ మంత్రం గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా సీసీఐ అధికారుల మాయాజాలంతో కనీస మద్దతు ధర అన్నదే రైతులకు దక్కడం లేదు. మహారాష్ట్ర వ్యాపారులతో ములాఖత్ కావడం ద్వారా ఎమ్మెస్పీ కన్నా తక్కువకే సేకరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితమే మద్నూర్లో నెలకొల్పిన సీసీఐ కొనుగోలు కేంద్రం ఒకట్రెండు రోజుల్లోనే మూసివేతకు సీసీఐ నిర్ణయించింది. వాస్తవానికి కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు అవుతుంది. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పత్తి రైతులకు ఈ కేంద్రం ద్వారా లాభం జరగాల్సి ఉండగా అలాంటిదేమీ కనిపించడం లేదు. రవా ణా ఖర్చులు భరించుకొని పత్తిని తీసుకెళ్తే తేమ శాతం పేరుతో సీసీఐ వారే కొర్రీలు పెట్టి రైతులను నిలువునా ముంచుతున్నారు. వీరిపై పర్యవేక్షించాల్సిన అధికారులెవ్వరూ లేకపోవడంతో వారిదే పైచేయి అన్నట్లుగా తయారైంది. ఈ విషయమై కలెక్టర్కు పలువురు రైతు సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పటికీ కామారెడ్డిలో కనీస స్పందన లేకుండా పోయింది. మద్నూర్ సీసీఐ కొనుగోలు కేంద్రంలో 58,596 క్వింటాళ్ల పత్తిని సేకరిస్తే, ప్రైవేటు వ్యాపారులు మాత్రం 1,05,266 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
నిజామాబాద్ జిల్లాలోనూ పత్తి పంట సాగువుతున్నది. ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీగా ధర్మపురి అర్వింద్ ఉన్నప్పటికీ ఇసుమంతైనా లాభం జరగడం లేదు. పత్తి రైతుల మేలు కోసం కనీసం సమీక్షలు నిర్వహించకపోవడం విడ్డూరం. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, కేంద్ర పెద్దలతో మాట్లాడి సీసీఐ ద్వారా తాత్కాలిక కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకోవడం కూడా అర్వింద్లో కనిపించకపోవడం ఈ ప్రాంత రైతుల దురదృష్టంగా మారింది. 2023-24 వానకాలంలో పత్తి పంటకు మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గమే మేలు రకం క్వింటాకు రూ.7020 కనీస మద్దతు ధరను నిర్ణయించింది. కానీ ప్రస్తుతం రైతు వ్యవసాయ క్షేత్రాల్లో రూ.6200లకు అమ్ముకోవాల్సి వస్తున్నది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన కులాచారి దినేశ్ సొంత నియోజకవర్గంలోని డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్, ఇందల్వాయిలో పత్తి పండించిన రైతులది దిక్కుతోచని పరిస్థితి. ఎంపీ పట్టించుకోకపోవడంతో మహారాష్ట్ర వ్యాపారులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం వెనుక బీజేపీకి చెందిన కీలక వ్యక్తులు ఉంటున్నట్లుగా రైతులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
నేను కౌలుకు భూమిని తీసుకొని 50 ఎకరాల్లో పత్తిని సాగు చేశాను. గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న కురిసిన అకాల వానలతో పంట నాశనమైంది. దీనికి తోడుగా చేతికొచ్చిన పత్తి పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన లేకపోవడంతోనే ప్రైవేటు వ్యాపారులకు రూ.6200లకే అమ్ముకోవాల్సి వస్తున్నది.
నేను ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. దిగుబడి భారీగా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి మద్దతు ధరను రూ.7020 ప్రకటించింది. కానీ మాకు మాత్రం అంతకు తక్కువే వస్తున్నది. పట్టించుకునే వారు లేకపోవడంతో పత్తి పండించిన మా బతుకులు ఆగమవుతున్నాయి. దయచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.