సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని. కాంగ్రెస్, బీజేపీలకు నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులే లేకుండా పోయారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి మూడోసారి టిక్కెట్ ఖరారు అయిన తర్వాత శుక్రవారం మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ప్రజా ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో ఆర్మూర్ హోరెత్తింది. 44వ జాతీయ రహదారి నుంచి ఆర్మూర్ మీదుగా అంకాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దాకా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జీవోల జీవన్రెడ్డికి మరోసారి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రైతులకు మూడు గంటల కరెంటు చాలంటున్నదని.. బీజేపీ మోటర్లకు మీటర్లు పెడతానంటున్నదన్నారు. రైతుల పొట్ట కొట్టే విధంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ కావాలో.. కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలే ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. విపక్షాలకు అభ్యర్థులే లేరని, వారితో తమకు పోటీయే లేదని స్పష్టం చేశారు.
– ఆర్మూర్, ఆగస్టు 25
ఆర్మూర్, ఆగస్టు 25: బీఆర్ఎస్ కు పోటీనే లేదని, కేసీఆర్కు ఎవరూ సాటిరారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమ సీఎం అభ్యర్ధి కేసీఆర్ అని… మరి మీ పార్టీలకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించారు. వారికి సీఎం అభ్యర్థులే లేరని, ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుంచి మూడోసారి టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్యే జీవన్రెడ్డి.. ఎమ్మెల్సీ కవిత, ఉమెన్స్ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలితతో కలిసి బుధవారం ఆర్మూర్కు వచ్చారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పెర్కిట్ హైవే వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. పెర్కిట్ హైవే నుంచి పెర్కిట్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా, కొత్తబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, సిద్ధులగుట్ట మీదుగా అంకాపూర్లోని ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీ, పాదయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డి అని, మరి కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులు ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ఆర్మూర్లో జీవన్రెడ్డికి పోటీనే లేదన్నారు. పంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 3గంటల కరెంటు సరిపోతదని అంటున్నాడని, బీజేపీ ప్రభుత్వమేమో మోటర్లకు మీటర్లు పెట్టమంటున్నదని తెలిపారు. 3 గంటల కరెంటు కావాలా..? మోటర్లకు మీటర్లు పెడతామంటున్న బీజేపీ కావాలా..? లేదంటే 24 గంటల ఉచిత కరెంటిచ్చే కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రూ.15 లక్షల కోట్ల బకాయిలను మాఫీ చేసిందని, కానీ రైతులకు రూపాయి కూడా రణమాఫీ చేయలేదన్నారు. బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు మన దోస్తులు కావని, మన నేస్తం కేసీఆరేనన్నారు. ఎర్రజొన్న రైతులకు బకాయిలు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా కాల్పులు జరిపించిన చరిత్ర కాంగ్రెస్కు ఉన్నదన్నారు. ఎర్రజొన్న రైతులకు జీవన్రెడ్డి అండగా నిలిచి తొమ్మిది రోజులపాటు దీక్ష చేశారని కవిత గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక బకాయిలు ఇస్తామని 2007లో కేసీఆర్తో చెప్పించి, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాగానే రూ.13 కోట్ల ఎర్రజొన్న బకాయిలను రైతులకు అందజేశామన్నారు. రైతులకు అండగా నిలిచిన జీవన్రెడ్డి కావాలో, అన్నదాతలను గోస పెట్టిన పార్టీలు కావాలో ఆలోచించుకోవాలన్నారు.
60 వేల మెజారిటీతో గెలిపిద్దాం..
ఆర్మూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర.. తనకు జైత్రయాత్రగా కనిపిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలు 65 సీట్లు ఇస్తే, 2018లో మరింత గొప్పగా 88 మంది అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలపై నమ్మకంతో మన నాయకుడు కేసీఆర్.. 2023 ఎన్నికలకు 115 సీట్లకు అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించి దేశంలోనే రికార్డు సృష్టించారని తెలిపారు. ఈసారి వందకు పైగా అభ్యర్థులను గెలిపించాలని కవిత కోరారు. జీవన్రెడ్డి 24 గంటలూ సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని, ఆయన ఆడుగుజాడల్లోనే పనిచేస్తారని తెలిపారు. జీవోల జీవన్రెడ్డి అంటూ ఎమ్మెల్యేకు కితాబిచ్చారు. తనకు సోదరుడులాంటి జీవన్రెడ్డి బోలా మనిషి అని, తమ కుటుంబంలో ఒకరని అన్నారు. గత ఎన్నికల్లో 30వేల మెజారిటీ సాధించిన జీవన్రెడ్డిని.. ఈసారి 60వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త.. జీవన్రెడ్డిలా గడపగడపకూ తిరిగి ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, చేయబోయో పనులను ప్రజలకు వివరించాలన్నారు. ఏ బ్యాలెట్ బాక్సును తెరిచినా బీఆర్ఎస్కే భారీ మెజారిటీ వచ్చేలా ప్రచారం చేయాలన్నారు.
అర్వింద్కు డిపాజిట్ కూడా దక్కనివ్వం..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు డిపాజిట్ కూడా దక్కనివ్వమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లు.. అర్వింద్ ఎక్కడ పోటీచేసినా వెంటాడి ఓడిస్తామని స్పష్టం చేశారు. ఎంపీ హోదాలో బర్త్డే జరుపుకొంటున్న అర్వింద్.. వచ్చే ఏడాది మాజీ అవుతాడని ఎద్దేవా చేశారు. ఆర్మూర్కు అర్వింద్ ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని బీజేపీ నాయకులను జీవన్రెడ్డి ప్రశ్నించారు. తాను సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో మాక్లూర్కు అర్బన్పార్కు, సిద్ధులగుట్టకు ఘాట్రోడ్డు, రూ. 300 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు, ఆలూర్ బైపాస్ రోడ్డు, ఆర్మూర్కు వంద పడకల దవాఖాన తెచ్చామని, 62వేల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. దీంతోపాటు ఆర్మూర్ను రెవెన్యూ డివిజన్గా, ఆలూర్, డొంకేశ్వర్ను నూతన మండలాలుగా ఏర్పాటు చేశామన్నారు. త్వరలో 3 వేల మందికి గృహలక్ష్మి పథకాన్ని మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చూడాలనుకుంటున్నారని, ప్రజల దీవెనతో తానుకూడా హ్యట్రిక్ సాధిస్తానని జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జీతగాడిలా ప్రజలకు జీవితాంతం సేవచేస్తానన్నారు.