కామారెడ్డి, జనవరి 6 ; కామారెడ్డి జిల్లాకేంద్రంలోని 49వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కేంద్రమిది. చివరి రోజు శనివారం మధ్యాహ్నం వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, సిబ్బంది భోజన విరామం తర్వాత సెంటర్లో కనిపించలేదు. దీంతో దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు.
ప్రజాపాలన సభలు శనివారం ముగిశాయి. డిసెంబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. శనివారం వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7,85,974దరఖాస్తులు వచ్చా యి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4,77, 808 దరఖాస్తులను ప్రజల నుంచి అధికారులు స్వీకరించారు. జిల్లాలో 530 జీపీలు, మూడు మున్సిపాలిటీల్లోని 146 వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను తీసుకున్నారు. ఆర్మూర్ 56,814, బాల్కొండ 87,212, బాన్సువాడ 41,689, బోధన్ 58,931, నిజామాబాద్ రూరల్లో 93,634 దరఖాస్తులు వచ్చాయి. కాగా మున్సిపాలిటీల పరిధిలో 1,39,528, పంచాయతీల్లో 3,38,280 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 3,08,166 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 526 జీపీలు, 80 మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తులను స్వీకరించారు. చివరి రోజు 41,370 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.