నందిపేట్/కామారెడ్డి/ ఎల్లారెడ్డి రూరల్/నవీపేట, ఫిబ్రవరి 25 : నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు హత్య, రజక దంపతులపై దాడి ఘటనను నిరసిస్తూ బుధవారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. నందిపేట మండల కేంద్రంలో డొంకేశ్వర్, నందిపేట్ మండలాల రజక ఐక్య కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జిల్లా రజకుల సంఘం ఆధ్వర్యంలో ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కుమ్మెర మల్లన్నస్వామి జాతరలో అకారణంగా చాకలి చంద్రకళ అనే మహిళ కుటుంబంపై దాడి చేసి చిన్నారి మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నవీపేట మండలం మహంతం గ్రామంలో కుమ్మెర ఘటనను నిరసిస్తూ విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
ఎల్లారెడ్డి పట్టణంలో రజకసంఘం అధ్వర్యంలో దోభీ గల్లీ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు కొవ్తొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లన్న జాతరలో రజక కుటుంబంపై రెడ్డి సామాజిక వర్గం దాడిచేయగా, రెండునెలల పసిపాప మృతి చెందిందని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.