నిజామాబాద్ సిటీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, వారికి చట్టం ప్రకారం రావల్సిన పరిహరంతోపాటు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన విజిలెన్సు అండ్ మానిటరింగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందిన ఫిర్యాదుల అనుగుణంగా లోతుగా విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ప్రత్యేక శ్రద్ధ కనబర్చి కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సీపీ కార్తికేయ మాట్లాడుతూ.. గత మీటింగ్లో 42 కేసులు విచారణలో పెండింగ్లో ఉండగా ప్రస్తుతం 23 మాత్రమే ఉన్నాయని వివరించారు. పోలీసు అధికారులు ఈ విషయంలో విచారణ జరుపడంతోపాటు బాధితులకు రావాల్సిన పరిహరం ఇప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర, చంద్రశేఖర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శశికళ, ఏసీపీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు