కామారెడ్డి, జనవరి 5 : జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులోరోడ్డు భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణం గా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా, రహదారి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని సూచించా రు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో పోలీసు కళాబృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దాబాల్లో పనిచేసేవారికి, యువతకు ప్రథమ చికిత్స, సీపీఆర్పై అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. జాతీయ ప్రాధికార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సీఎస్ రావు, డీఎస్పీ ప్రకాశ్, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, ఆర్టీవో వాణి, డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.