డిచ్పల్లి, మే 17 : గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కొత్త దిశను చూపుతున్నది. నగరాలు, పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు పల్లెలంటే చెత్తాచెదారం, మురికి కాలువలతో అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు ఏ గ్రామాన్ని చూసినా పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో పల్లెలన్నీ ప్రగతిబాటలో నడుస్తున్నాయి. అభివృద్ధికి సరిపడా నిధులు, నిరంతర పర్యవేక్షణతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడింది. రోడ్లను ఊడ్చడం, డ్రైనేజీలను శుభ్రం చేయడం, చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తుండడంతో ప్రతి పల్లె పరిశుభ్రంగా కనిపిస్తున్నది. ప్రతి ఊరూ మెరిసేలా అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితోపాటు స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు.
ప్రత్యేక పారిశుద్ధ్య పనులు..
పల్లెప్రగతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. వానకాలం రానున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 నుంచి 23 వరకు పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు.
ముందస్తు చర్యలు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వానకాలంలో గ్రామీణ ప్రాంతాలన్నీ మురికిగా, రోడ్లన్నీ బురదమయంగా మారేవి. మురికి కాలువలన్నీ దుర్వాసనను వెదజల్లేవి. దీంతో ఏ ఇల్లు చూసినా సీజనల్ వ్యాధులతో కొట్టుమిట్టాడేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్యరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రత్యేక కార్యక్రమాలు.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కాపాడుతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాల్లో మార్పులు మొదలయ్యాయి. చెత్త తరలింపు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతి ఊరికి ట్రాక్టర్, ట్రాలీని అందజేసింది. రానున్న వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేశారు.
చేపట్టనున్న కార్యక్రమాలు..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేశాం.
– కిషన్రావు, ఎంపీవో
పల్లెప్రగతి ద్వారా మౌలిక వసతులు మెరుగుపడ్డాయి
ఒకప్పుడు పల్లెల్లో ఎక్కడా చూసినా చెత్తచెదారం, మురికి కాలువలు అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత కనిపిస్తున్నది. ఈనెల 23వ తేదీ వరకు పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయి.
– సునీల్కుమార్, పంచాయతీ కార్యదర్శి, ఘన్పూర్
సీఎం కేసీఆర్తోనే గ్రామాల అభివృద్ధి
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుండడంతో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు మెరుగుపడ్డాయి. పంచాయతీ కార్మికులు ప్రతిరోజూ రోడ్లను శుభ్రం చేస్తుండడంతో గ్రామాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి.
– సాయిలు, ఇందల్వాయి