నిజమాబాద్: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, అవన్నీ ఉట్టిమాటల్లానే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) విమర్శించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా, బాల్కొండ నియోజకవర్గంలో ఇంకా కల్లాల వద్ద, రహదారులపై ధాన్యపు రాసులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయని, ప్రభుత్వం సకాలంలో కొనుగోలుచేయకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నాయని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోయేసరికి అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని, తద్వారా ప్రభుత్వం రైతులను గోస పెడుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ధాన్యం నీటి పాలవుతున్నదని చెప్పారు. తడిచిన, మొలకలు వచ్చిన ధాన్యం తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదని రైతులు గోడు వెళ్లబోసుకుంటుటూ గతంలో కేసీఆర్ తడిచిన ధాన్యాన్ని కొన్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు. కల్లాల వద్ద కొన్న ధాన్యం కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సకాలంలో లారీలు ప్రభుత్వం పంపకపోవడంతో ధాన్యం నీటి పాలు అవుతున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు పడుతున్న కష్టాల కంటే అందాల పోటీలు ముఖ్యమయ్యాయని ఎద్దేవా చేశారు.
ధాన్యం సేకరణపై అధికారులతో రివ్యూ చేయడానికి సమయం లేని ముఖ్యమంత్రి అందాల పోటీల విషయంలో ఎనిమిది సార్లు సమీక్ష నిర్వహించారని విమర్శించారు. రైస్ మిల్లులకు చేరిన ధాన్యం నుంచి ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తడిచిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని, కొన్న ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ తొందరగా అందజేయాలన్నారు. అకాల వర్షాలకు నష్టపోతున్న సజ్జలు, ఇతర పంటల రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు.