కంఠేశ్వర్/కామారెడ్డి, ఏప్రిల్ 13: ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. ఉమ్మడి జిల్లాలో వినతులు వెల్లువెత్తాయి. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలు కిటకిటలాడాయి. ప్రజలు భారీగా తరలి రావడంతో సందడిగా మారాయి. కామారెడ్డిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అధికారులు వినతులు స్వీకరించారు.
వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్.. సంబంధిత అధికారులకు రిఫర్ చేస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలపై 135 వినతులను స్వీకరించామని తెలిపారు. అదనపు కలెక్టర్ విక్టర్,జడ్పీ సీఈవో చందర్,జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో పాటు సబ్కలెక్టర్ వికాస్ మహతో, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.