నిజామాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నెలన్నర రోజులు అవుతున్నది. ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తుల హడావిడి తప్పితే స్థానికంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా సమీక్షలు, సమావేశాలు, భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిపెట్టే నాథుడే కరువయ్యాడు. ఎంతసేపూ రాజకీయ ప్రకటనలు తప్పితే అధికారం చేపట్టిన తర్వాత బాధ్యతగల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ప్రణాళికాబద్ధమైన పరిపాలనకు అడుగులు వేయలేదని ప్రజలంతా భావిస్తున్నారు. 11 మందితో మంత్రివర్గం కొలువుదీరిన పిదప మిగిలిన ఆరు మంత్రి పదవుల భర్తీ అలాగే ఉన్నది. ఇందులో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిథ్యం కరువైంది. పోటాపోటీగా ఎమ్మెల్యేగా గెలిచినవాళ్లు, ఎన్నికల్లో ఓటమి చెందిన వారంతా పైరవీలకే పెద్దపీట వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇన్చార్జి మంత్రి హోదాలో జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చి ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియపై రివ్యూ నిర్వహించి వెళ్లారు. తదనంతరం మరోమారు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. మంత్రి పదవులు లేకపోతే ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దిశా నిర్దేశం చేయొచ్చు కదా? అంటూ ప్రజలంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు.
నిజామాబాద్ రూరల్, జనవరి 17: ఎమ్మెల్యేలు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం రూ. కోటితో క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. ఇందులోభాగంగా జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్ విద్యుత్ సబ్స్టేషన్ పక్కన రూరల్ క్యాంప్ కార్యాలయ భవనం నిర్మించగా..గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చాక ఆర్అండ్బీ అధికారులు తాళం వేశారు. ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎన్నికై 45 రోజులు గడుస్తున్నా ..ఇప్పటి వరకు క్యాంపు కార్యాలయంలో ఆయన అడుగుపెట్టకపోవడం గమనార్హం. కార్యాలయ భవనం వాస్తు సరిగ్గా లేదని ఇక్కడికి అడుగు పెట్టడానికి ఎమ్మెల్యే సుముఖత చూపడంలేదని సమాచారం. దవాఖానల్లో మెరుగైన వైద్యచికిత్స చేయించుకుని సీఎంఆర్ఎఫ్ కోసం రూరల్ నియోజకవర్గంలో సుమారు 12వందల మంది దరఖాస్తు చేసుకోగా..వారంతా ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు సీఎంఆర్ఎఫ్ కోసం ఎక్కడ దరఖాస్తు ఇవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు. క్యాంప్ కార్యాలయానికి వేసిన తాళం ఎప్పుడు తీస్తారని ఆర్అండ్బీ ఏఈ ప్రవీణ్కుమార్ను సంప్రదించగా.. తమకు ఎమ్మెల్యే నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాధానమిచ్చారు
వచ్చేది ఎండాకాలం. తీవ్రమైన తాగునీటి కొరత ఉండే అవకాశాలు ఉంటాయి. ఉభయ జిల్లాల్లో చారిత్రక ప్రాజెక్టుల్లో ప్రస్తుతానికి నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. యాసంగి సాగుకు నీటిని వినియోగిస్తే మూడు, నాలుగు నెలల తర్వాత తాగునీటి ఎద్దడి తీర్చడం పెద్ద సవాలుగా మారుతుంది. తాగు, సాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే అధికార యంత్రాం గం అప్రమత్తం కావాల్సి ఉన్నది. కానీ అధికార పార్టీలోని ఎమ్మెల్యేలకు మాత్రం ఉభ య జిల్లాలోని రైతులు, సామాన్య ప్రజల ఇక్కట్లు ఏవీ కనిపించడం లేదు. నెలన్నర రోజులైనప్పటికీ ఎమ్మెల్యేలుగా చేపట్టాల్సిన ప్రాథమిక విధిని వారు విస్మరించారు. ఉమ్మడి జిల్లాకు ప్రాతినిథ్యం వహించేందుకు మంత్రి లేకపోయినప్పటికీ ఇన్చార్జి మంత్రితోనైనా ఈ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉన్న ది. ముందస్తు అప్రమత్తతో నీటి పారుదల శాఖ అధికారులు, మిషన్ భగీరథ ఇంజినీర్లతో సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఎంతకూ ఈ వ్యవహారంపై ఎవ్వ రూ దృష్టి సారించలేదు. బీఆర్ఎస్ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఇప్పటికే నిజాంసాగర్ ఆయకట్టు రైతుల అవసరాలపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాగునీటి విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. అయినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేకుండా పోవడం శోచనీయంగా మారింది. బాన్సువాడ నియోజకవర్గంలోనైతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడైతే ఎంతసేపూ ఇసుక రీచ్ల వెంటే పర్యటనలు సాగిస్తుండడం చర్చనీయాంశం అవుతున్నది. మంజీరా పరీవాహక రైతులకు సాగునీటి అవసరాలను గుర్తించని సదరు నేత… ఎన్నికల ఫలితాల మరునాటి నుంచే ఇసుక తిన్నెలపై కన్నేసి వ్యవహారాలను నడుపుతుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది.
పదేండ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలంతా పదవులపైనే ఎక్కువగా దృష్టి సారించారు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల సరళి వెనక్కి వెళ్లినట్లు అయ్యింది. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి నిలుపుదల చేస్తున్నారు. పథకాలను ఎడాపెడా రద్దు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మంజూరైన పనులను ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ వాటిని హస్తం ప్రజాప్రతినిధులెవ్వరూ పట్టించుకోవడం లేదు. రోడ్డు విస్తరణ, కొత్త తారు, సీసీ రోడ్డు పనులపై దృష్టి సారించడం లేదు. పెండింగ్ పనులను ప్రజల అవసరాలరీత్యా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ వాటిపై సమీక్షించిన దాఖలాలే లేకుండా పోయాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే లీకుల నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పీసీసీ ముఖ్య నాయకుడు షబ్బీర్ అలీలు ఎవరికి వారే పదవుల కోసం పైరవీలు షురూ చేశారు. పదవుల పందెరం జోరుగా నడుస్తుండడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలకు సైతం సమయం ఇచ్చే గతి లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోనూ స్తబ్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఉన్నతాధికారుల ఆదేశాలను కింది స్థాయికి తీసుకెళ్లడం మినహా ప్రజలకు అవసరమయ్యే అత్యవసర వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.