నవీపేట, జూన్ 15 : రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లింగంగుట్ట సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటుచేసిన పాలిటెక్నిక్ కళాశాల అనతికాలంలోనే రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది. భవిష్యత్తులో త్వరగా స్థిరపడాలన్నా, ఇంజినీరింగ్గా ఎదగాలన్నా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు మించిన ప్రత్నామ్నాయం మరొకటి లేదు. డిప్లొమా విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగ్గా ఉండడంతో ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఒక్కో కోర్సులో 60 సీట్లు..
నవీపేట, నిజామాబాద్, నందిపేట, కోటగిరి, నిజామాబాద్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయి. నిజామాబాద్ బాలుర కళాశాలలో సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ కోర్సులు, కోటగిరిలో మెకానికల్, ఈఈఈ, నందిపేటలో ఈసీఈ, మెకానికల్, నిజామాబాద్ బాలికల కళాశాలలో సివిల్, ఈసీఈ, నవీపేటలో మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
గ్రామీణ విద్యార్థులకు వరం..
నవీపేట మండలకేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల గ్రామీణ పేద విద్యార్థులకు వరంగా మారింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన ల్యాబ్లు, అనుభవజ్ఞులైన ప్యాకల్టీతో విద్యాబోధన ఉండడంతో నాణ్యమైన విద్యకు బాటలు పడుతున్నాయి.
కమిషనర్ పర్యవేక్షణలో..
సాంకేతిక కళాశాల విద్యా కమిషనర్ నవీన్ విఠల్ పర్యవేక్షణలో కళాశాలలు కొనసాగుతున్నాయి. ఫ్యాకల్టీ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిం
చేందుకు విశేష కృషిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆధునిక టెక్నాలజీకి అనుకూలంగా, డిమాండ్ ఉన్న కోర్సులను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థుల సంరక్షణతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల హాజరునమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. పాలిసెట్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అడ్మిషన్ విధానాన్ని వివరించేందుకు ప్రతి ఏటా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు.
ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 14న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నెల 18వ తేదీ వరకు స్లాట్ బుకింగ్, 16 నుంచి 21వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీన సీట్ల కేటాయింపు, 25 నుంచి 29 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
సాంకేతిక విద్యతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు..
ప్రస్తుతం సాంకేతిక విద్యకు డిమాండ్ ఉన్నది. రాష్ట్ర కమిషనర్ నవీన్ మిట్టల్ పాలిటెక్నిక్ కళాశాలల్లో చాలా మార్పులు తీసుకువచ్చారు. నవీపేట మండలకేంద్రంలోప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల పేద విద్యార్థులకు వరంగా మారింది.
– పాటిల్ శివమహదేవ్, ఇన్చార్జి ప్రిన్సిపాల్,నవీపేట పాలిటెక్నిక్ కళాశాల
ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నేను కళాశాల ఏర్పడినప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నా. ఇప్పటివరకు నాలుగు బ్యాచ్లు పూర్తయ్యాయి. కళాశాలలో విద్యను అభ్యసించిన వారు ప్రభుత్వ రంగాల్లో స్థిర పడ్డారు.
– – రూప్సింగ్, ఫ్యాకల్టీ, నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాల
శాస్త్రవేత్తగా స్థిరపడతా..
నేను నవీపేట పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఫైనలియర్ చదువుతున్నా. కళాశాలలో ఫ్యాకల్టీ బాగుంది. అర్థమయ్యేలా చదువు చెబుతున్నారు. నేను కష్టపడి చదివి ఇస్రోలో సైంటిస్టుగా ఉద్యోగం సాధిస్తా.
– బర్దావల్ శ్రీనివాస్, విద్యార్థి, నవీపేట పాలిటెక్నిక్ కళాశాల
ఐఏఎస్ ఆఫీసర్ అవుతా..
నవీపేట పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాను. కళాశాలలో విద్యాబోధన బాగుంది. భవిష్యత్తులో సివిల్లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ఇందుకు తగిన విధంగా కష్టపడి చదువుతున్న.
– సుంకరి స్నేహ, సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి, కళాశాల నవీపేట.