వినాయక నగర్, ఆగస్టు 23: నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారులపై (Money Lenders) చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశారు. అవసరం ఉన్నవారికి డబ్బులు ఇస్తూ, అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారాలు చేస్తున్నవారి వివరాలను ముందుగానే సేకరించిన పోలీస్ అధికారులు.. వారి ఇండ్లతోపాటు ఫైనాన్స్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకుల నుంచి పూర్తి వివరాలు సేకరించడంతోపాటు వారి రికార్డులను సైతం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారం నిర్వహించేందుకు అనుమతులు ఉన్నాయా లేవా అనే పూర్తి వివరాలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీల అనంతరం ఎంతమంది అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వివరాలను నమోదు చేసి, వారిపై కేసులు పెట్టేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇకనుండి అక్రమ వడ్డీ వ్యాపారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.