నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 20: శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. సంఘవిద్రోహశక్తులను తుదముట్టించేందుకు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల సంరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు పోలీసులు. అరాచకశక్తుల ఆట కట్టిస్తూ శాంతిభద్రతలను నెలకొల్పుతున్నారు. నిరంతరం ప్రజారక్షణకు పాటుపడుతున్నారు. ఎలాంటి ఆపదలో ఉన్నా ఒక్క పిలుపుతో మేమున్నామంటూ కదిలివస్తారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు అమరులయ్యారు. వారి సేవలను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా..
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారు. 1959లో దేశ సరిహద్దును చైనా ఆక్రమించేందుకు కుట్రపన్నింది. అక్సాయిచిన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది చైనా దురాక్రమణను ఎదిరించి అమరులయ్యారు. అక్టోబర్ 21న జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా ప్రతి ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు. అసాంఘికశక్తులు, తీవ్రవాదుల దుశ్చర్యలు, మతోన్మాదుల దురాగతాలను ఎదిరించడంలో పోలీసుల పాత్ర ఎనలేనిది. జిల్లాకు పొరుగునే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులుగా ఉండడంతో శాంత్రిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పగలు, రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. 1980వ దశకంలో ఉన్న పరిస్థితుల్లో శాంత్రిభద్రతల పరిరక్షణ కోసం ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉన్న సమయంలో శాంతిభద్రతల పరిక్షణకు పోలీసుశాఖ విరామం లేకుండా పనిచేసింది.
జిల్లాలో 19 మంది వీరమరణం
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అవిచ్ఛిన్న శక్తులతో జరిగిన పోరాటంలో 19 మంది పోలీసులు అమరులయ్యారు. మతోన్మాద, వేర్పాటువాద, విధ్వంసకర శక్తులకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించారు. నిజామాబాద్ జిల్లాలో 1986 నుంచి 2019 వరకు 19మంది పోలీసులు అమరులయ్యారు. వీరిలో ఒక సీఐ, ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, 13 మంది కానిస్టేబుళ్లు, ఒక హెడ్కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఉన్నారు. అమరుల స్మృత్యార్థం శుక్రవారం పోలీసు హెడ్క్వార్టర్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8.45 గంటలకు నిర్వహించే పోలీసు ఫ్లాగ్ డే కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని సీపీ కేఆర్ నాగరాజు తెలిపారు.
అమరులైన పోలీసులు వీరే..
సీఐ ఎం.లింగారెడ్డి, ఎస్సై విక్టర్, ఏఎస్సైలు రాంచందర్రావు, ఎంఏ గఫార్, హెచ్సీ గంగాధర్, కానిస్టేబుళ్లు ఎండీ కుతుబుద్దీన్, సోమరాజు, సత్తయ్య, సయ్యద్ సర్వర్, రామ్చందర్, బషీరుద్దీన్, సుబ్బారావు, ఎండీ గౌస్, గణేశ్, నర్సయ్య, అంజయ్య, గంగాధర్, ఎన్.శంకర్, హెచ్జీ సీతారాం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. అమరుల సేవలను స్మరించుకుంటూ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.