గాంధారి/భిక్కనూరు/నస్రుల్లాబాద్/ ఎల్లారెడ్డి రూరల్/బిచ్కుంద, ఏప్రిల్ 12: కామారెడ్డి జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు గాంధారి, భిక్కనూరు, నస్రుల్లాబాద్, బీర్కూర్, ఎల్లారెడ్డి పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కలకలం రేపింది. అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారి ఇండ్లు, ఫైనాన్స్ కార్యాలయాలతోపాటు దుకాణాల్లోనూ దాడులు చేశారు. భిక్కనూరులో కోడిప్యాక వెంకటేశం, మురికి రాజేశం వ్యాపారుల వద్ద ప్రామిసరి నోట్లు లభ్యం కావడంతో సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. బీర్కూర్ మండల కేంద్రంలోని గోపి మహాదన ఇంట్లో 21 ప్రామిసరి నోట్లు, రెండు చెక్కులు లభించగా..ఆయనపై మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గాంధారిలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డి పట్టణంలో ప్రముఖ వ్యాపారి రాచకొండ రామకృష్ణ ఇంటిపై పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. సదరు వ్యాపారి నుంచి 15 బ్లాంక్ చెక్కులు, ఒక ప్రామిసరీ నోట్ను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై బొజ్జ మహేశ్ తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బిచ్కుందలో నాల్చర్ బాలరాజ్, కాపర్తి విఠల్ ఇండ్లలో తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసినట్లు సీఐ జగడం నరేశ్, ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. నాల్చర్ బాలరాజ్ అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్లు నిర్ధారించినట్లు వారు పేర్కొన్నారు.
కామారెడ్డి, ఏప్రిల్ 12: జిల్లాలో అక్రమ మార్గాలు, వడ్డీల ద్వారా అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న 23 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 70 మంది వ్యాపారులపై దాడులు చేసి 23 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రూ.49. 58 లక్షలు, 157 గ్రాముల బంగారం, 315 ప్రామిసరీ నోట్లు, 63 ల్యాండ్ డాక్యుమెంట్లు, 25 చెక్స్, పట్టా పాస్ పుస్తకాలు, ఖాళీ ప్రామిసరీ నోట్లతోపాటు ఇతర డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు, మోసపూరిత మాటల ద్వారా మరికొందరు వ్యాపారులు ఆర్థిక సాయం చేస్తామంటూఅమాయక ప్రజల నుంచి ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూముల దస్తావేజులను తీసుకొని అప్పులు ఇస్తున్నారని తెలిపారు. అధిక వడ్డీ రేట్ల లెక్కలు చూపుతూ చెల్లించలేని పరిస్థితులను తీసుకువస్తూ వారి ఆస్తులను జప్తు చేసుకుంటున్నారని చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.