Telangana | నిజామాబాద్ క్రైం : ప్రజల ఆస్తులతో పాటు వారికి రక్షణ కల్పించే ఓ పోలీస్ కానిస్టేబుల్.. అర్ధరాత్రి అనంతరం ఓ ఆటో డ్రైవర్ చేసిన చోరీకి సహకరించడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే ఓ కానిస్టేబుల్.. తనకు కేటాయించిన నైట్ డ్యూటీలో దొంగతనాలు, అల్లర్లు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిఘా పెట్టాల్సింది పోయి.. దొంగతనం చేసిన వ్యక్తికి కాపలాగా ఉన్నాడు. ఈ సంఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డు చౌరస్తా వద్ద ఆదివారం అర్ధరాత్రి 1: 39 గంటలకు ఓ ఆటో రిక్షా నుంచి పోలీస్ యూనిఫాం ధరించి, చేతిలో ట్యాబ్ పట్టుకొని ఓ కానిస్టేబుల్ దిగాడు. అతనితో పాటు ఆటోడ్రైవర్ సైతం ఆటో నుంచి దిగి ఓ ఇంటిముందు నిలిపి ఉంచిన బైక్ నుంచి పెట్రోల్ చోరీ చేశారు. ఆటో డ్రైవర్ పెట్రోల్ తీస్తుండగా.. సదరు కానిస్టేబుల్ కాపలాగా ఉన్నాడు. చోరీ అనంతరం పెట్రోల్ బాటిల్ను కానిస్టేబుల్కు ఆటో డ్రైవర్ ఇచ్చాడు. అనంతరం వారిద్దరూ కలిసి అదే ఆటో రిక్షా ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై ఐదో టౌన్ ఎస్సై సాయినాథ్ను వివరణ కోరగా.. పెట్రోల్ దొంగిలించిన ఏరియా ఎక్కడో అర్థం కావడం లేదని.. సీసీ ఫుటేజీ చూశామని, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎవరనేది విచారణ చేపడుతున్నామని తెలిపారు.