వేల్పూర్, జూన్ 27 : వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మెట్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న లారీ మార్గమధ్యంలోని వేల్పూర్ ఎక్స్రోడ్డు సమీపానికి రాగానే చెడిపోయింది. దీంతో రోడ్డు మీదనే లారీ ఆగి ఉండడంతో వెనుకవైపు నుంచి వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. లారీ మార్గమధ్యంలో ఎందుకు ఆపారని వేల్పూర్ ఎస్సై విచారణ చేస్తుండగా లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో 265.15 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండడంతో ఎస్సై వినయ్ రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వేల్పూర్ తహసీల్దార్ సతీశ్రెడ్డి, సివిల్ సైప్లె అధికారులు రవీందర్, దత్తాద్రి, శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి లారీలో ఉన్న రేషన్ బియ్యాన్ని మరొక లారీలోకి లోడ్ చేసి బియ్యాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ సైప్లె అధికారులు రవీందర్, దత్తాద్రి, శ్రీనివాస్ తెలిపారు.
రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి..
సుమారు 265.15 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఎక్కడ నుంచి వస్తున్నాయని రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. లారీలో గన్నీ బ్యాగులు ఉండడంతో రేషన్ బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చి తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజు లారీల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఆర్మూర్ ప్రాంతంలో కూడా రెండు, జిల్లా కేంద్రంలో సమీపంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న రెండు లారీలను పట్టుకున్నట్లు తెలిసింది. మెట్పల్లి వైపు నుంచి సోమవారం తెల్లవారు జామున సుమారు 5లారీల్లో ఆర్మూర్ వైపు వెళ్లినట్లు సమాచారం. వీటిలో నాలుగు లారీలను అధికారులు పట్టుకున్నారు.
ఆ లారీ ఎటు వెళ్లినట్లు..
మెట్పల్లి వైపు నుంచి 5 లారీల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 4 లారీలను పట్టుకున్నారు. మరో లారీ ఎటువైపు వెళ్లిందనేదానిపై తీస్తున్నారు. అధికారులే వారికి సమాచారం అందించడంతో లారీని తప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఓ రైస్మిల్కు నిత్యం రేషన్ బియ్యం వస్తున్నట్లు తెలిసింది. రైస్మిల్ నుంచి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మళ్లీ ఎఫ్సీఐకి తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.